Viral news : ఎక్వేరియం (Aquarium) లోని చేప చిన్నారి గొంతులో దూరడంతో ఆ చిన్నారి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స చేసి తొలగించారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని ఇండోర్ నగరం (Indore city) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్గా మారింది.
ఇండోర్లో ఓ మహిళ తన ఇంట్లోని ఎక్వేరియం శుభ్రం చేసేందుకు అందులోని చేపలను ఓ జాలిలో వేసింది. ఆమె ఎక్వేరియం శుభ్రం చేస్తుండగా.. ఆమె ఏడాది కొడుకు చేపలను చూస్తూ కేరింతలు కొడుతున్నాడు. అదే సమయంలో ఓ చేప పైకి ఎగిరి నోరు తెరిచి నవ్వుతున్న బాలుడి నోట్లోకి దూరింది. దాంతో ఆ బాలుడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి చేపను తొలగించారు. ఈఎన్టీ విభాగం అధిపతి డాక్టర్ యామినీ గుప్తా ఆధ్వర్యంలోని వైద్యబృందం అత్యవసర శస్త్రచికిత్స చేసింది. ‘బాలుడి గొంతులో చిక్కిన మూడు అంగుళాల చేప బలంగా కొట్టుకుంటోంది. దాంతో బాలుడికి గాయమై లాలజలంతోపాటు రక్తం బయటకు వచ్చింది. చేపను తొలగించాక వైద్యులు బాలుడిని ఒకరోజు తమ పర్యవేక్షణలో ఉంచుకుని డిశ్చార్జి చేశారు.