కోల్కతా, ఆగస్టు 22: ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అందరినీ కలుపుకుని పోవాలంటూ ఆయన తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటారని, అయితే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై మాత్రం దాడులు చేయిస్తుంటారని ఆరోపించారు. చీమ కుట్టినా సరే ఈడీ, సీబీఐ దర్యాప్తు అంటూ తయారైపోతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తమ పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా తమకు చెందిన వారి ఇండ్లపై సోమవారం రాత్రంతా దాడులు జరిగాయని ఆరోపించారు.‘ఆ అబ్బాయి (అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి) రెండు రోజుల ముందే విదేశాల నుంచి వచ్చాడు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా అతడికి చెందిన నాలుగైదు ప్రదేశాలలో దర్యాప్తు సంస్థలు సోదాలు జరిపాయి’ మమత అన్నారు. రాజకీయ ప్రతీకారేచ్ఛతోనే ఇదంతా జరుగుతున్నదని ఆమె ఆరోపించారు. తన ఇంటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేశాయంటూ కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలను ఆమె కొట్టిపడేశారు.