హైదరాబాద్ : కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం దళితబంధు పథకంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులతో పాటు కాదు.. అన్ని వర్గాల్లో అణగారి ఉన్నారన్నారు. తరతరాలుగా సామాజిక వివక్షకు గురైన జాతి దళిత జాతి అని, 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత సైతం దళితుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా దళిత జాతి హింసకు గురైందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ఉజ్వలమైన పాత్ర పోషించారని, క్రమంగా అంబేద్కర్ ఆలోచనా సరళి బయటకు వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడింది కూడా అంబేద్కర్ పుణ్యమే అని గతంలో చెప్పానన్నారు.
రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కు ఉండాలని అంబేద్కర్ చెప్పారని, అంబేద్కర్ అనేక పోరాటాలు సాగించారన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు సాధికారత చేకూర లేదని, గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చిందన్నారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదని, అనేక పార్టీలు పాలించాయన్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక భిన్నమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయని.. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని చెప్పారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతున్నారని, 75లక్షల మంది దళితులు ఉంటే 13లక్షల భూములే ఉన్నాయన్నారు. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పు రాలేదన్నారు.
పాలమూరు వంటి జిల్లా నుంచి లక్షల మంది వలసలు వెళ్లారని.. తెలంగాణ ఏర్పాటును విఫలప్రయత్నమని చెప్పే ప్రయత్నాలు జరిగాయన్నారు. బాలారిష్టాల్ని అధిగమించుకుంటూ సంక్షేమం కోసం పాటుపడ్డామన్నారు. ఆసరా పింఛన్లు పెంచామని.. వికలాంగుల పింఛను రూ.3వేలకు పెంచినట్లు చెప్పారు. తెలంగాణలో 3కోట్ల టన్నుల వరిధాన్యం పడుతోందని, తెలంగాణలో వ్యవసాయ రంగ స్థిరీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తోందని, రాష్ట్రంలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని.. ప్రకృతి సైతం సహకరిస్తోందని చెప్పారు. విభజనకు ముందు ఏపీలో ఎకరం అమ్మినా తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనే పరిస్థితి లేదని.. వ్యవసాయంలో రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచిందన్నారు.
ఇప్పుడు ఒక ఎకరం తెలంగాణలో అమ్మి.. ఆరు ఎకరాలు ప్రకాశం జిల్లాలో కొనే పరిస్థితి ఉందన్నారు. ఉచిత విద్యుత్తో రైతులకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కోటి29లక్షల ఎకరాలు సాగవుతోందని.. యాసంగిలో 65లక్షల ఎకరాలు సాగులో ఉందని వివరించారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని, నీటి తీరువా పన్నే లేదన్నారు. ఉచిత నీరు, విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 26లక్షల టన్నుల ఎరువులు వినియోగిస్తున్నామని, గతంలో 8లక్షల ఎరువులు మాత్రమే వినియోగించారన్నారు.