టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభిస్తారు. అనంతరం జీజీ కళాశాల మైదానంలో లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మాట్లాడుతారు. సీఎం పర్యటన సందర్భంగా నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానుల స్వాగత తోరణాలతో జిల్లా కేంద్రం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ పర్యటనను ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగ సభను ఇందూరు గడ్డపై టీఆర్ఎస్ పార్టీ తలపెట్టడంతో నేతలంతా దిగ్విజయం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఆకాశ మార్గంలో జిల్లాకు సీఎం వస్తుండడంతో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. పోలీస్ పరేడ్ మైదానంలో ముందస్తుగా హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. భారీ బహిరంగ సభకు 9 నియోజకవర్గాల నుంచి జనం తరలిరానున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నూతన సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో నిజామాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీఎం పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానుల స్వాగత ఏర్పాట్లతో జిల్లా కేంద్రం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ పర్యటనను ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగ సభను నిజామాబాద్ గడ్డపై టీఆర్ఎస్ తలపెట్టడంతో నేతలంతా దిగ్విజయం చేసేందుకు సన్నద్ధమయ్యారు. నూతన కలెక్టరేట్కు సమీపంలోని జీజీ కాలేజీ గ్రౌండ్లో జరిగే సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఆకాశమార్గంలో నిజామాబాద్కు సీఎం వస్తుండడంతో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. పోలీస్ పరేడ్ మైదానంలో హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. భారీ బహిరంగ సభకు 9 నియోజకవర్గాల నుంచి జనం తరలిరానున్నారు.
కంచుకోట ఇందూరు గడ్డ…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను మొదట్నుంచి టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్గా పరిగణిస్తుంటారు. 2001లో పార్టీ పురుడు పోసుకున్న తొలి నాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుపు విజయాలను ఈ ప్రాంత ప్రజలే మూకుమ్మడిగా టీఆర్ఎస్కు అందించారు. అప్పటి వరకు వేళ్లానుకొని పాతుకుపోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్, ఆంధ్రా పార్టీ టీడీపీలను కాదని ప్రజలంతా టీఆర్ఎస్ను అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ ప్రాంతంపై ఆంధ్రా పెత్తందారుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన టీఆర్ఎస్ పోరాటానికి ఊరూరా మద్దతు దక్కింది. ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను వివరిస్తూ ఊరూరా తిరుగుతూ కేసీఆర్ ఆనాడు చేసిన పర్యటనలు చరిత్రలో నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ సారథ్యంలో జరిగిన అనేక ఎన్నికల్లోనూ మరుపురాని విజయాలను ప్రజలు అందించారు.
ప్రతి ఎన్నికల్లోనూ గెలుపును సొంతం చేసుకుంటూ కంచుకోటగా ఇందూరు గడ్డ మారింది. అలాంటి ప్రాంతం తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా కేసీఆర్కే జై కొడుతూ వస్తున్నది. 2014లోనూ 9 అసెంబ్లీ స్థానాలు, జహీరాబాద్, నిజామాబాద్ లోక్సభ స్థానాలను కట్టబెట్టింది. 2018లో ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు ఏకపక్షంగా గెలిచింది. జహీరాబాద్ ఎంపీనీ కొల్లగొట్టింది. వివిధ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జోరుగా విజయాలను నమోదు చేసుకోగా స్థానిక సంస్థల పోరులో ఊరూరా గులాబీ జెండాకే పీఠాలు దక్కాయి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లలో టీఆర్ఎస్ ఏలుతోంది.
హెలికాప్టర్లో సీఎం రాక
నిజామాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో రానున్నారు. మొదట రోడ్డు మార్గంలో వస్తారని భావించినప్పటికీ ఆకాశమార్గాన రానున్నట్లుగా సీఎంవో ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరుతారు. 1.15గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానానికి వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ఎల్లమ్మగుట్టలోని టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి, ముఖ్య నాయకులతో కొద్దిసేపు సంభాషిస్తారు. అక్కడి నుంచి సీఎం ప్రత్యేక కాన్వాయ్ రోడ్డు మార్గంలో కంఠేశ్వర్ మీదుగా బైపాస్ రోడ్డులో నూతన సమీకృత కలెక్టరేట్కు చేరుకుంటుంది. సరిగ్గా మధ్యాహ్నం 2.40గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కలెక్టర్ సి.నారాయణ రెడ్డిని తన చాంబర్లో కూర్చోబెడతారు. అనంతరం గిరిరాజ్ కళాశాల మైదానంలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరుతారు. మధ్యాహ్నం 3గంటలకు సభా వేదికకు చేరుకొని ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
లక్ష మందితో భారీ సభ..
సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి వేముల, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల తదితరులు
లక్ష మందితో నిర్వహించబోతున్న టీఆర్ఎస్ సభను జనసంద్రంగా మార్చేందుకు ఉభయ జి ల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఇం దులో భాగంగా ఐక్యంగా సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నడుం బిగించారు. ఇప్పటికే రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమన్వయం చేస్తూ జన సమీకరణపై దృష్టి సారించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటన కావడంతోపాటు పార్టీ పరంగా భారీ బహిరంగ సభ ను తలపెట్టడంతో జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సైతం ఐదు నియోజకవర్గాలకు చెంది న వారందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి దా దాపుగా 15వేల మందిని తరలించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. జుక్కల్ నుంచి 10వేల మంది తరలివచ్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సైతం ఎక్కడికక్కడ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలను తరలిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు స్వచ్ఛందంగా రానున్నారు. బోధన్, నిజామాబాద్ రూరల్ నుంచి జనాలు వచ్చేలా ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. సీఎం ప్రారంభించే కొత్త కలెక్టరేట్తోపాటు టీఆర్ఎస్ భవన్, బహిరంగ సభ నిర్వహించే గిరిరాజ్ కళాశాల ప్రాంగణాన్ని స్పెషల్ టీం ఆదివారం సాయంత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నది. కేసీఆర్ పర్యటించనున్న ప్రాంతాలను బాంబ్ స్కాడ్, డాగ్స్కాడ్ బృందాలతో తనిఖీ చేశారు. సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తును ఐజీ కమల్హాసన్రెడ్డి పర్యవేక్షించారు. ఆదివారం ఆయన కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజుతో కలిసి హెలీప్యాడ్ పాయింట్లతోపాటు కలెక్టరేట్ భవనం, గిరిరాజ్ కళాశాల ప్రాంగణం, టీఆర్ఎస్ భవన్ను పరిశీలించారు. విధులు నిర్వర్తించే పోలీసు బలగాలకు అవగాహన కల్పించారు. సంగారెడ్డి, కామారెడ్డి ఎస్పీలు రమణ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, డీసీపీ వి.అరవింద్ బాబు,అదనపు డీసీపీలు ఉషా విశ్వనాథ్, ఎమ్.నరేందర్ రెడ్డి, గిరిరాజ్, ఏసీపీలు ఉన్నారు.
ముస్తాబైన కొత్త కలెక్టరేట్..
ఇందూరు, సెప్టెంబర్ 4: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు (సోమవారం) ప్రారంభించ నున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, సీఎంవో నుంచి వచ్చిన సెక్యూరిటీ విభాగం అధికారులు కొత్త కలెక్టరేట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని అన్ని విభాగాలను సుందరంగా తీర్చిదిద్దారు.
కదిలిన దస్ర్తాలు
కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. పాత కలెక్టరేట్ (ప్రగతిభవన్) నుంచి రికార్డులు, కంప్యూటర్లు తదితర సామగ్రిని సిబ్బంది కొత్త కలెక్టరేట్కు ఆదివారం తరలించారు.
కలర్ఫుల్ పెయింటింగ్..
ఖలీల్వాడి, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు స్వాగతం పలుకుతూ నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న గోడలకు కలర్ఫుల్ పెయింటింగ్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన ప్రచార కార్యదర్శి చల్లపల్లి కృష్ణ ఆధ్వర్యంలో పెయింటింగ్స్ వేశారు.