హైదరాబాద్: భారతదేశంలో ఎన్నో సంస్కరణలు రావలసిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం, దేశంలోని యువత భవిష్యత్తు కోసం కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కొత్త ఆర్థిక పాలసీలు రావాలని, నూరు శాతం అద్భుతాలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని తేల్చిచెప్పారు.
ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి కావలసిన అనేక ఉదాహరణలు మన చుట్టూనే ఉన్నాయని, కానీ మనం ఏమీ నేర్చుకోవడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చైనా వెళ్లినప్పుడు ఒక రోజంతా డిప్రెషన్తో హోటల్లోనే ఉండిపోయానని చెప్పారు. 1980లో చైనా జీడీపీ మన దేశం కన్నా తక్కువగా ఉందని, అక్కడి నుంచి ఆ దేశం ఎన్నో రంగాల్లో ఎవరూ ఊహించని అభివృద్ధి సాధించిందని చెప్పారు.
ఒక్కో ఫ్లైఓవర్ 100, 150, 180 కిలోమీటర్ల పొడవున్నాయని, వాటిని చూస్తే అసలు మనిషులే కట్టారా? అనే ఆశ్చర్యం కలిగిందన్నారు. ‘ఎక్కడపోయిందో అమెరికా.. దాన్ని దాటేసి చైనా చాలా ముందుకు వెళ్లిపోయింది. చైనాలోని దాదాపు ప్రతి సిటీలో 600-800 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ మెట్రో రైళ్లు ఉన్నాయి. సబ్ వే రైల్ అంట. అవన్నీ దాటిపోయి బుల్లెట్ ట్రైన్స్, శాటిలైట్స్, అంతరిక్షం వరకూ వచ్చారు. మనం మాత్రం ఇంకా చేతికి, మూతికి కొట్టుకుంటూ దళిత బంధు దగ్గరే ఉన్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ పరిస్థితి చూసి దుఃఖంతోనే ఈ మాటలు చెప్తున్నానని, ఎవరినైనా బాధిస్తే క్షమించాలని చెప్పారు. ఉదయం నిద్ర లేస్తే చైనా దేశం మొత్తం పనికి కదులుతుందని చెప్పిన ఆయన.. అక్కడ లింగ బేధం, కుల భేదం ఏవీ లేవని అన్నారు. అందరికీ అక్కడ పనిచేసే అవకాశం ఉందన్నారు. ఆ పరిస్థితి మన దేశంలో రావాలని కోరుకుంటే తప్పా? కనీసం అలాంటి డ్రీమ్ కూడా ఉండొద్దా? అని అడిగారు.
భారత్ నుంచి ప్రమాదమా?.. చైనా వేసిన కమిటీ కథ
భారతదేశంపై కొంత కాలం క్రితం చైనా ఒక కమిటీ వేసిందని, ఆ ఇతివృత్తాన్ని కూడా కేసీఆర్ వెల్లడించారు. భారత దేశ జనాభా కూడా 130 కోట్లు ఉంది కదా, ఒకవేళ ఎప్పుడైనా భారత్ కూడా మేలుకొని అభివృద్ధి పథం వైపు నడిస్తే తమకు ఎదురయ్యే ప్రమాదాలు ఏమున్నాయి? అని చైనా ఆందోళన చెందిందట. దీనిపై ఒక కమిటీని వేసి ఒక ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు కేసీఆర్ చెప్పారు.
కానీ మూడు నెలలకే ఆ కమిటీ నివేదిక సమర్పించిందట. ‘ఇదేంటి? అని ప్రశ్నిస్తే ఇప్పటికీ ఆ దేశంలో ఇంకా కులం, మతం అని కొట్టుకుంటున్నారు. వాళ్లు మనకేం పోటీ కాదని చెప్పిందట ఆ కమిటీ’ అని కేసీఆర్ చెప్పారు. మన దేశంలో మాత్రం ఇప్పటికీ మత విద్వేషాలే రగిలిస్తాం, మన ఎజెండానే మతం అంటుంటారని సీఎం విమర్శించారు. ఉదయం లేచిన దగ్గర నుంచి బండి సంజయ్ ఇలానే మాట్లాడుతుంటాడని ఎద్దేవా చేశారు.
‘ఎవరు వద్దారండీ మతం? ఎవరికి ఇష్టమైన మతం వాళ్లు పుచ్చుకుంటారు. ఎవరు వద్దంటున్నారు. ఎవరు వ్యతిరేకిస్తారు? ఏం మేం గుళ్లు, గోపురాలు కట్టడం లేదా? గుండు గీసుకోవడం లేదా? సత్యనారాయణ కథలు చెప్పుకోవడం లేదా? తిరుపతికి పోవడం లేదా?’ అని ప్రశ్నించారు. దేశం గురించి అసలు పట్టింపే లేకుండా అయితే సరిహద్దుల మీద లేదంటే మతం మీద భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు.
‘ఇదేనా దేశ అజెండా? వెరసి ఫలితం ఏమైంది? నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కన్నా మన జీడీపీ తక్కువ ఉంటదా? అంతర్జాతీయ ఇండెక్స్లలో బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంటదాండీ? తల వంచుకోవాలని అనిపించదా?’ అని నిలదీశారు. ఈ విషయంలోనే పరివర్తన రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ కూడా వస్తుందని ఎవరూ అనుకోలేదని, అలాగే ఎక్కడ ఏ విస్ఫోటనం పుడుతుందో ఎవరూ చెప్పలేరని అన్నారు.