హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడంతో హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో.. ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్అండ్టీ కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో.. కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకారం అందిస్తామని కంపెనీ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మంగళవారం ప్రగతి భవన్లో ఎల్అండ్టీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రో ఉన్నతాధికారులు ఆర్థిక నష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నగరానికి మెట్రోసేవలు ఎంతో అవసరం
భేటీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాధరణ పొందిందన్నారు. కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోనూ ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్లో మెట్రో మరింత విస్తరించాల్సి ఉందన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను గాడిలో పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తుందన్నారు. ఎలాంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషించనున్నట్లు పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ప్రజావసరాల దృష్ట్యా కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
మెట్రో తిరిగి పుంజుకునేలా చర్యలు
హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు తిరిగి పుంజుకుని ప్రజావసరాల దృష్ట్యా మరింతగా విస్తరించే దిశగా చర్యలు సీఎం కేసీఆర్ కంపెనీ అధికారులకు భరోసా ఇచ్చారు. ఇందుకు విస్తృతంగా చర్చించి పూర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవం తీసుకురాగలమో అవగాహన కోసం ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కమిటీలో మున్సిపల్ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు, ఫైనాన్స్ స్పెషల్ సెక్యూటరీ రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారని సీఎం పేర్కొన్నారు. నష్టాల బారి నుంచి మెట్రోను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా ఆదుకునే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి, అధ్యయనం చేసి త్వరలో నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ఎంఏఅండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, మెట్రో అధికారులు, ఎల్అండ్టీ సీఈఓ అండ్ ఎండీ సుబ్రహ్మణ్యం, ఎన్వీఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డీకే సేన్, ప్రాజెక్టుల సీఈఓ అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈఓ కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.