వనపర్తి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): వనపర్తిలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. శనివారం టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 8న వనపర్తి జిల్లా పర్యటనకు రానున్న సీఎం కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్టు వెల్లడించారు. కర్నెతండా లిఫ్టుకు కర్నెతండాకు బదులుగా వనపర్తిలోనే శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా వనపర్తికి హెలికాప్టర్లో వచ్చి సాయంత్రం 5:25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని చెప్పారు. మొదట చిట్యాల సమీపంలో వనపర్తి మార్కెట్యార్డు ప్రారంభోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతారని వివరించారు. జిల్లా పార్టీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ నూతన భవన సముదాయం ప్రారంభించడంతోపాటు కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నూతన మెడికల్ కళాశాలలకు ఒకేచోట శంకుస్థాపన శిలాఫలాకాల ఆవిష్కరణ ఉంటుందని వెల్లడించారు.