CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నేరుగా సూర్యాపేటకు చేరుకున్న సీఎం.. తొలుత రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్లో నిర్మాణమైన ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ అంతా కలియతిరిగి పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, శాణంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించనున్నారు.
అనంతరం సమీపంలోనే నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.