హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇది చాలా దారుణమైన బడ్జెట్. దురదృష్టం ఏంటంటే.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చదువుతూ.. మహాభారతంలోని శాంతిపర్వంలో ఉండే శ్లోకాలను కోట్ చేశారు. శాంతిపర్వంలో ఉండే శ్లోకం కోట్ చేశారు కానీ.. ఆమె చెప్పింది శాంతిమార్గం.. చేసింది అధర్మం. ఒక రాజ్యాన్ని రాజు ఎలా నడపాలి అనే విషయాన్ని చెప్పినటువంటి ధర్మ సందేశం అది. ఒక యాగం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు.. చివరగా శాంతి మంత్రం చెప్తారు. లోకహితాన్ని కోరుతారు. ప్రజలు అందరూ బాగుండాలని, న్యాయమార్గంలో పరిపాలన జరగాలని కోరుకుంటారు. అందరూ సుఖంగా బతకాలని చెప్తారు. ఆమె చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం.. ప్రవచించింది మాత్రం అసత్యం.
దేశ ప్రజలను ఘోరంగా వంచించారు. అన్ని వర్గాలకు బడ్జెట్లో గుండు సున్నా పెట్టారు. గోల్ మాల్ తప్ప ప్రజలకు ఎవరికీ లాభం లేదు. పేద ప్రజలకు అయితే గుండు సున్నా. ఎస్సీలు 20 కోట్లు, ఎస్టీలు 10 కోట్లు ఉన్నారని చెబుతున్నారు. కానీ ఈ జనాభా పెరిగిపోయింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 12 వేల 800 కోట్లు కేటాయించారు. దళితులు, గిరిజనుల పట్ల కేంద్రానికి శ్రద్ధ లేదు. మన రాష్ట్రంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 33 వేల 611 కోట్లు కేటాయించాం. మేం స్టోరీలు చెప్పడం లేదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.