తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ స్థానం బీసీకి దక్కింది. తెలంగాణ శాసనమండలిలో అధ్యక్షా అని పిలిపించుకున్నదీ బీసీయే. తొలి విడుతలో ఇద్దరు ఎస్సీలు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఓ మైనార్టీ నేత కూడా ఉప ముఖ్యమంత్రి బాధ్యత నిర్వహించారు. నిరుద్యోగులకు కొలువులు కల్పించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించింది ఓ ఎస్సీ మేధావి. అంతెందుకు.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం బీసీ నేత చేతిలోనే ఉన్నది. పార్టీ సెక్రటరీ జనరల్గా సమన్వయం చేస్తున్నదీ అదే బీసీ నేత. ఈ ఉదాహరణలు కొన్నే. వీటిని పరిశీలిస్తే చాలు.. కేసీఆర్ నాయకత్వంలో, ప్రభుత్వంలో, పార్టీలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం కొరవడిందంటూ కొందరు పనిగట్టుకొని చేస్తున్న విమర్శల్లో వీసమెత్తయినా పసలేదని తేల్చిపారేయడానికి.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ఈ రోజు టీఆర్ఎస్లో ఉన్న అనేకమంది బడుగు బలహీనవర్గాలకు చెందినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వేలు పట్టుకుని నడిపించినవారు! రాజకీయ ఓనమాలు నేర్పించినవారు. వారిలో నాయకులుగా ఎదిగిన విద్యార్థులున్నారు! మెరికల్లా తయారైన యువజనులున్నారు! వీరుల్లా మారిన వనితలున్నారు! వీరంతా నాడు ఉద్యమంలో కొట్లాడి, కేసుల బారిన పడి.. రాష్ట్ర సాధన చరిత్రాత్మక ఘట్టానికి సాక్షీభూతులుగా నిలిచి.. నేడు బంగారు తెలంగాణను రూపుదిద్దడంలో దీక్షాదక్షులై.. అదే శ్వాసగా సాగిపోతున్నారు! ఎందుకంటే వారికి సమై క్య రాష్ట్రంలో ఉద్యమం తప్ప మరో వ్యాపకం లేదు! స్వరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి తప్ప మరో సోయి లేదు! ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదు.. సందర్భం వచ్చిన ప్రతిసారీ పదవులే వారిని వరిస్తూ వచ్చాయి. సేవలకు గుర్తింపు పొందుతున్నారు! అది ప్రత్యక్ష ఎన్నికల సమరాంగణం కావచ్చు.. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఏర్పాటైన వివిధ కార్పొరేషన్ల నాయకత్వం కావచ్చు! వీటన్నింటికి మించిన పార్టీ నిర్మాణ బాధ్యతలు కావచ్చు! పార్టీ కోసం ఏం చేస్తున్నాం అన్న ఏకైక భావనతో తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు! వీరిలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఒక్కసారి గమనిస్తే ఉద్యమ నేతగా కేసీఆర్ నాయకత్వంలో.. సీఎంగా కేసీఆర్ మార్గదర్శకత్వంలో బడుగు బలహీనవర్గాలకు దక్కుతున్న ప్రాధాన్యం ఎంతటిదో అర్థమవుతుంది.
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలోనూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాలకు వివిధ అధికారిక పదవులు కట్టబెట్టడంలోనూ, అత్యున్నత హోదాలు కల్పించడంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరెవ్వరూ సాటిరారనే విషయాన్ని గతం, వర్తమానం నిరూపిస్తున్నాయి. నిజానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి నుంచి నేటి వరకూ నాయకత్వ స్థానాల్లోనే నిలుపుతున్నారు. నిన్న మొన్నటివరకు టీఆర్ఎస్ ప్రాపకంలో ఎదిగి, మంత్రిస్థాయి వరకు ఎన్నో కీలక పదవులు పొందిన ఈటల రాజేందర్ కూడా బీసీయే. ఆయనకు పార్టీలో ఇచ్చిన గౌరవం, రాష్ట్ర విభజన వేళ కీలకమైన టీఆర్ఎస్ఎల్పీ పదవిని ఆయనకే అప్పగించిన నమ్మకం.. స్వరాష్ట్రంలో కీలక పదవులకు మంత్రిని చేసిన ధీమా.. ఇదీ కేసీఆర్ నైజం! ఇవన్నీ తెలిసి కూడా ఈటల రాజేందర్ ఆత్మవంచన చేసుకోవడమే ఇక్కడ విషాదం! నిన్నటికి నిన్న జనగణనతో పాటు బీసీల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో కేసీఆర్ తీర్మానం చేయించారు. వారికి ప్రభుత్వ ఫలాలు, ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్న తపనే అది. బడుగు, బలహీన వర్గాలు నిలదొక్కుకోవాలంటే వారికి రాజకీయంగా పట్టు అవసరం. అందుకే.. మిగతా పార్టీల మాదిరిగా తనవి శుష్క వాగ్దానాలు కావని, చిత్తశుద్ధిని మేళవించిన ప్రయత్నాలేనని చాటిచెప్తూ ఈ వర్గాలకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో 51% రిజర్వేషన్లు కల్పించారు.
సమైక్య రాష్ట్రంలో అణగారిన కులాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ వర్గాల గురించి ఆలోచించింది. ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై తెలంగాణ ఉద్యమ సమయంలోనే అధ్యయనం చేసిన కేసీఆర్ వాటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నారు. దళితబంధు లాంటి పథకం మరే రాష్ట్రంలోనూ లేదు. సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు.
-ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్