దళితబంధు కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం రూపురేఖలపై వివరణ ఇచ్చారు. శాలపల్లి సభలో మాట్లాడుతూ.. ‘దళిత మేధావుల్లారా.. బిడ్డలారా.. సింహల్లాగా కదలండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడూ ఎమ్మెల్యేలతో పాటు దళితమేధావులు పర్యవేక్షించాలి. దళిత ప్రజాప్రతినిధులు అందరూ దళితబంధు కమిటీలు వేస్తారు. ఊరికి 6, మండలానికి 15,నియోజకవర్గానికి 24, జిల్లాకు 24, రాష్ట్రంలో 24 మందితో కమిటీ వేస్తాం. ఒక లక్షా 25 వేల దళిత సైన్యం ఈ పథకాన్నిపర్యవేక్షిస్తుంది. వీరి కనుసన్నల్లోనే దళిత రక్షణ నిధిఏర్పాటు అవుతుంది. 119 నియోజవకర్గాల్లో రూ.40 నుంచి రూ.50 కోట్లు దళితుల రక్షణ కోసం బ్యాంకుల్లో నిల్వ ఉంటాయి. రక్షణ నిధి అనేది భారతదేశ చరిత్రలో ఇది తొలిసారి. దళితులు పేదరికంలో కూరుకుపోయే సమస్య రానేరాదు. 75 లక్షల మంది దళిత ప్రజానీకం ధనిక ప్రజానీకంగా మారాలి. రాజకీయాలు జరుగుతుంటాయి. ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. కేసీఆర్ కాకుంటే ఇంకొకరు సీఎం అవుతారు. నేను తెచ్చిన పథకాలను ఎవరూ తీసేయలేరు.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గొప్ప గొప్ప ఉద్యమాలకు తెలంగాణ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో చాలా కష్టపడి తెలంగాణ భవన్ కట్టాం. తమిళనాడు డీఎంకే అధ్యక్షులు రాందాస్ వచ్చి ప్రారంభించారు. ఒక ఎకరం జాగలో ఇంత అందమైన బంగ్లా కట్టినవ్. తెలంగాణ ఇస్తే ఎట్ల చేస్తవ్ అన్నడు. ఆయన అన్నట్టు తెలంగాణను గొప్పగా చేసుకుంటున్నం. దళిత జాతిని నూటికి నూరు శాతం విజయ తీరాల వైపు నడిపించాలి. గొప్పగా దేశంలో తలెత్తుకునేలా ఈ దళితబంధుకు శ్రీకారం చుట్టాం.’
– సీఎం కేసీఆర్
‘దళిత బంధు వచ్చిన తర్వాత రేషన్ కార్డు, పెన్షన్లు బంద్ కావు. ఆర్థికంగా నిలదొక్కొవాలి. అనుమానాలు పక్కనపెట్టి ఒకరికొకరు సహకరించుకోవాలి. హుజూరాబాద్ దళితులు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. హైదరాబాద్లో బజోజా కులం ఉంది. అందరూ కోటీశ్వరులే. అలా ఎదగాలి. నా మెదడును కరిగించి ఈ స్కీంను రూపొందించాను. ఈ స్కీం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోదు. పాత అకౌంట్లో వేస్తే బాకీలు పట్టుకునే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టుకునే వీలు కలగాలంటే కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు ఖాతాలు తెరిపించి తెలంగాణ దళితబంధు అని పేరు పెడుతారు. ఓ కార్డు ఇస్తారు. కార్డులో ఉండే చిప్ ద్వారా కలెక్టర్ నిధులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.’ అని సీఎం పేర్కొన్నారు.