న్యూఢిల్లీ: టెర్రర్ ఫండింగ్, అక్రమ చొరబాట్ల కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగు రాష్ట్రాల్లోని సుమారు 13 ప్రాంతాల్లో తనిఖీలు(ED Raids) నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రోహింగ్యాలు, బంగ్లాదేశీలను అక్రమ రీతిలో భారత్లోకి పంపిస్తున్నారని, వ్యవస్థీకృత పద్ధతిలో చొరబాట్ల నేరాలకు పాల్పడుతున్నట్లు యూపీ ఏటీఎస్ పోలీసులు కేసు బుక్ చేశారు. భారత్లోని వివిధ ప్రాంతాల్లో చొరబాటుదారులు సెటిల్ అయ్యే రీతిలో ఐడెంటీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ దందా కొనసాగేందుకు విదేశాల నుంచి నిధులను కూడా పంపారని, ఛారిటీ ట్రస్టులు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. అనుమానిత లబ్ధిదారులకు నగదు అందజేశారని, చిన్నపాటి లావాదేవీలు కూడా చేసినట్లు దర్యాప్తులో తేలింది.