Left Over Food | మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం చాలా మందికి రోజువారీ అలవాటు. ఇలా చేయడం వల్ల సమయం ఆదా కావడంతోపాటు ఆహార వృథా కూడా తగ్గుతుంది. అయితే వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసే విధానం కూడా వంట చేసినంతే ముఖ్యమని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) సూచిస్తోంది. సరైన పద్ధతిలో వేడి చేయకపోతే ఆహారంలో బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. చాలామంది క్రితం రోజు కూర లేదా పప్పును వేడి చేస్తూ దానిలో తాజాగా వండిన కూర లేదా పప్పును కలిపేస్తుంటారు. అయితే ఇలా చేయకూడదని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచిస్తోంది. తాజాగా వండిన ఆహారం, మిగిలిన ఆహారం ఉష్ణోగ్రతలు, తాజాదనం వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి రెండింటినీ విడివిడిగా బాగా వేడి చేసి, అవసరమైతే తర్వాత మాత్రమే కలపడం మంచిది.
ఒకే ఆహారాన్ని పదే పదే వేడి చేసి మళ్లీ ఫ్రిజ్లో పెట్టడం కూడా మంచిది కాదు. ప్రతిసారి ఫ్రిజ్ నుంచి బయటకు తీసి వేడి చేసి, మళ్లీ చల్లబరిచి నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. అందుకే ఒకసారి మాత్రమే వేడి చేసి తినేలా ముందుగానే అవసరమైన పరిమాణాన్ని తీసుకోవడం ఉత్తమం. మిగిలిన ఆహారాన్ని మొత్తం వేడి చేయకుండా, తినాల్సినంత మాత్రమే తీసుకుని వేడి చేయాలి. మిగతా ఆహారాన్ని ఫ్రిజ్లో అలాగే ఉంచడం వల్ల దాని నాణ్యత సురక్షితంగా ఉంటుంది. ఉదాహరణకు నలుగురికి సరిపడే పులావ్ మిగిలి ఉండి ఒక్కరే తినాల్సి వస్తే, మొత్తం కాకుండా ఒక్క సర్వింగ్ మాత్రమే వేడి చేసుకోవాలి. మైక్రోవేవ్లో ఆహారం వేడి చేసేటప్పుడు మధ్య మధ్యలో బాగా కలపాలి. చాలాసార్లు పైభాగం మాత్రమే వేడిగా ఉండి, లోపల మాత్రం చల్లగానే ఉంటుంది. ఇలా సమానంగా వేడి కాకపోతే కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా జీవించే అవకాశం ఉంటుంది. అందుకే ఆహారం మొత్తం సమానంగా వేడెక్కేలా కలుపుతూ వేడి చేయడం అవసరం.
ఫ్రీజర్లో నిల్వ చేసిన ఆహారాన్ని నేరుగా స్టవ్పై లేదా మైక్రోవేవ్లో వేడి చేయకూడదు. ముందుగా పూర్తిగా కరిగిన తర్వాత మాత్రమే వేడి చేయాలి. లేదంటే బయట భాగం ఎక్కువగా వేడెక్కి, లోపల చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆహారం సురక్షితంగా మారదు. సరిగా వేడి చేయని ఆహారం చూసేందుకు లేదా వాసనకు బాగానే అనిపించినా, అందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ఆహారం తీసుకుంటే కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తాయి. మిగిలిన ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేసి, అవసరమైనంత మాత్రమే ఒక్కసారి వేడి చేసి తీసుకోవడం ద్వారా ఆహార వృథాను తగ్గించడంతోపాటు కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఆహార భద్రత నిపుణులు సూచిస్తున్నారు.