న్యూఢిల్లీ: ఎలీ యానిమేషన్స్ సంస్థ నిర్మించిన మహాప్రభు జగన్నాథ్(Mahaprabhu Jagannath) చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయాల్సి ఉన్నది. కానీ ఆ ఫిల్మ్ రిలీజ్పై ఒడిశా హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పిటీషన్పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ఇవాళ వెల్లడించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తక్షణమే ఈ పిటీషన్పై విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోరారు.
యానిమేషన్ ఫిల్మ్లో జగన్నాథుడి పాత్రను చిత్రీకరించిన విధానంపై న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ఒడిశా హైకోర్టు తన తీర్పులో చెప్పింది. మహేశ్ కుమార్ సాహూ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ సినిమా రిలీజ్పై స్టే విధించింది. పిల్ దాఖలు చేసిన వారిలో పూరి ఆచార్య డాక్టర్ ప్రమోద్ కుమార్, ఉమాశంకర్ ఆచార్య కూడా ఉన్నారు. ఒడిశాలో చిత్ర ప్రదర్శన ఆపేయాలని, ఆ సినిమాకు సీబీఎఫ్సీ ఇచ్చిన సర్టిఫికేట్ను రద్దు చేయాలని కోరుతూ ఒడిశా కోర్టులో పిటీషన్ వేశారు.
చిత్రంలో జగన్నాథుడి బాల్యం, డైలాగ్లు, సాహసాలు, యుద్ధ సన్నివేశాలు చూపించిన తీరును తప్పుపట్టారు. ఆ సన్నివేశాలన్నీ స్కంద పురాణం, బ్రహ్మ పురాణం, సనాతన ఆలయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు పిటీషన్లో అభ్యంతరాలు తెలిపారు.