ఖైరతాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కుల సంఘంగా మారిపోయిందని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్ ఆరోపించారు. ఇతర సామాజికవర్గాల ఓట్లడిగే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. అత్యధికంగా జనాభా కలిగిన బంజారా ప్రజలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంగోతు రాంబాబు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని, ఆకాంక్షలు నెరవేరాయని చెప్పారు. 500 జనాభా కలిగిన గిరిజన తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి, రైతు బంధు మంజూరు చేసి ఆదుకున్నారన్నారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహరాజ్ జయంతిని గుర్తించి, ప్రభుత్వ నిధులతో అధికారికంగా నిర్వహించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు.
రాష్ట్ర విభజనతో ఏపీలో విలీనమైన ముంపు మండలాల ఉద్యోగులను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారని, ఆత్మగౌరవ భవనం (సేవాలాల్ బంజార భవన్) నిర్మించారని, రెండు దఫాలుగా ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంజారా జనాభాను గుర్తించి, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు నామినేటెడ్ పదవుల్లో సముచితమైన స్థానం కల్పించారన్నారు. ఇలా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలుపడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసినందుకు మాజీ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, తెలంగాణ అన్ని రంగాల్లో సంపూర్ణమైన అభివృద్ధి చెందాలన్నా అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రఘురాం రాథోడ్, ఉపాధ్యక్షులు వడ్తా రేఖ్యా నాయక్, బీమ్లాల్ పవార్, పరశురాం నాయక్, సేవాలాల్ యువ సేన రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్, సోషల్ మీడియా ఇన్చార్జి మోతిలాల్ నాయక్, గ్రేటర్ నాయకులు బాల్సింగ్ నాయక్ పాల్గొన్నారు.