చిలిపిచెడ్, ఏప్రిల్ 28: మిషన్ భగీరథలో పని చేస్తున్న కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సరైనది కాదని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు అన్నారు. మంగళవారం చిలిపిచేడ్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనం ఇవ్వడం లేదని.. ఇచ్చే వేతనం కూడా 6 నెలలుగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో కార్మికులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని తెలిపారు.
కార్మికుల పనిగంటలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారు తెలిపారు. 4 కొత్త లేబర్ చట్టాల అమలు కార్మికుల హక్కులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే అవుతుందని అన్నారు. బ్రిటిష్ కాలం నుంచే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మికచట్టాలను తొలగించడం సిగ్గు చేటు అని విమర్శించారు. దేశం మొత్తం కరోనాతో అతలాకుతలమవుతున్న సమయంలో (2019, 2020)లో నాలుగు కొత్త లేబర్ చట్టాలను తీసుకురావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సంపన్నులు పెరిగారని.. నిరంతరం కష్టపడుతున్న కార్మికులు మాత్రం రోడ్డున పడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మే డే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. దేశవ్యాప్తంగా మే 1 నుంచి 7వ తేదీ వరకు మేడే వార్షికోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.