ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులు
దైవ సందేశం వినిపించిన బిషప్ రెవరెండ్ రైట్ ఏసీ సాలమాన్రాజ్, చర్చి ప్రెసిబెటరీ
రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్ సుకుమార్
విద్యుత్ కాంతుల్లో ప్రార్థనా మందిరం
ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 25: ప్రపంచ ప్రఖ్యాత మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. శనివారం తెల్లవారుజామునే శిలువ ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి మెదక్ సీఎస్ఐ చర్చికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. మొదటి ఆరాధనకు మెదక్ డయాసిస్ అధ్యక్ష మండల బిషప్ రెవరెండ్ రైట్ ఏసీ సాలమాన్రాజ్ పాల్గొని భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో బిషపమ్మ వజ్ర సంతోషిణి, బిషప్ కుటుంబ సభ్యులు, పాస్టర్లు దయానంద్, రాజశేఖర్, డేవిడ్ రిచర్డ్స్, విజయ్కుమార్, మెదక్ చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, గెలన్ చిత్తరంజన్దాస్, శాంతికుమార్, శాంసన్ సందీప్, సునీల్, ఉదయ్కిరణ్, సాలోమాన్రాజ్, సువన్డగ్లస్, సుశీల్కుమార్, వసతి గృహాల మేనేజర్ జాయ్ముర్రె, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు…
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీఎస్ఐ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. బస్సుడిపో ఎదురుగా గల మెయిన్ గేట్ నుంచి మొదలుకొని చర్చి ముఖద్వారం వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. చర్చి ప్రధాన ద్వారం వద్ద పోలీసులు మెటల్ డిటెక్టర్లు, పోలీస్ డాగ్లతో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి భక్తుల తాకిడి పెరగడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించారు.
యేసు చూపిన బాటలో నడుచుకోవాలి
మార్గం చూపే రక్షకుడు..
మానవుడిగా ఈ లోకానికి…
చర్చి ప్రెసిబెటరీ రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్ సుకుమార్
దేవుడే మానవుడిగా ఏసు రూపంలో ఈ లోకానికి వచ్చాడని మెదక్ చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్ సుకుమార్ అన్నారు. ఉదయం 10 గంటలకు రెండో ఆరాధన ప్రార్థన అనంతరం భక్తులనుద్దేశించి దైవ సందేశం వినిపించారు. ఈ ప్రపంచానికి సృష్టికర్త యేసు ప్రభువు అని, ప్రభువు జననం సర్వమానవాళికి సంతోషకరమన్నారు. ప్రభువును హృదయ పూర్వకంగా ఆరాధించే వారందరికీ విశ్వాసంగా ఉంటారన్నారు. పాప విమోచన కోసమే శిలువపై ప్రాణాలు అర్పించారని, పాపుల రక్షణ కోసం తన రక్తాన్ని చిందించారని.. సత్యం, ధర్మం, శాంతి, దయ, ప్రేమతో చూపిన మార్గంలో మనమంతా నడుచుకోవాలని పిలుపునిచ్చారు.