హిమాలయాల్లో కైలాస పర్వతం, ఆ హిమగిరి చెంతన మానససరోవరం, ఆ సరోవరంలో స్నానాదికాలు చేస్తున్న ఓ సాధువు. ఆ ముముక్షువు గడ్డకట్టే నీరు ఒంటికి తాకుతున్నా, ఎముకలు కొరికే చలిగాలులు శరీరాన్ని రాసుకుంటూ వెళ్తున్నా.. ఇవేవీ తనకు ఇబ్బంది కలిగించడం లేదన్నట్టుగా తన పనిలో తానున్నాడు. స్నానం పూర్తి చేసుకుని, ఆ పక్కనే మంచు పరుచుకున్న నేలపై కూర్చుని ధ్యానానికి ఉద్యుక్తుడయ్యాడు!
అదొక ప్రభుత్వ దవాఖాన. అనుభవజ్ఞుడైన వైద్యుడు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను సునాయాసంగా చేస్తున్నాడు. రోగి శరీరాన్ని కోసి, శస్త్ర చికిత్స నిర్వహించి చకచకా కుట్లు వేశాడు. ఆ రోగి బాధను, భయాన్ని గమనిస్తున్నా, అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. వైద్యం ఫలితాన్ని కూడా ఆశించడం లేదు. కేవలం తన కర్తవ్యదీక్షలో నిమగ్నమయ్యాడు. ఈ రెండు ఉదాహరణల్లోని వ్యక్తులు పరిసరాలతో గానీ, తమ కర్తవ్యఫలాల గురించి గానీ బంధనాలు వేసుకోలేదు. కేవలం తమ కర్తవ్యంతో మాత్రమే వారికి సంబంధం.
అతి శీతల జలాలు సాధువు శరీరాన్ని తాకినా ఆయన మనసును కదిలించలేక పోయాయి. వైద్యుని కత్తి రక్తాన్ని చిందిస్తున్నా అది ఆయన మనసును చలింప జేయలేక పోయింది. రెండు సందర్భాల్లోని వ్యక్తులు తమ కర్తవ్యాన్ని తప్ప ఫలితాలను త్యజించినవారే. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన బోధ కూడా ఇదే. ‘కర్మలు ఆచరించడమే నీ పని, ఫలితం గురించి ఆలోచించొద్దు’ అని ఉద్బోధ చేశాడు.
సాధారణంగా రాబోయే కష్టసుఖాలు మన అనుభవంలోకి రాకముందే మనం వాటిని అనుభవించడం మొదలు పెడతాం. ఉదాహరణకు ఒక బాలుడు తన తండ్రి ఆదేశానుసారం ఒక నెల తర్వాత గురుకులానికి వెళ్లాల్సి ఉంటే, ఆ బాలుడు ఆ నెలరోజులూ ఒక భయంలో కూరుకుపోతాడు. గురుకులానికి వెళ్లే రోజు ఆసన్నమయ్యేకొద్దీ ఆందోళన చెందుతూ ఉంటాడు. ఆ బాలుడు ఇంకా గురుకులానికి వెళ్లనే లేదు. కానీ, గురుకులంలో లేని కష్టాలను, ఇబ్బందులను, కోల్పోయే స్వేచ్ఛను ఊహించుకొని బాధపడుతుంటాడు. ఇంటికి దూరమవు తానన్న ఆవేదన ఆ బాధను రెట్టింపు చేస్తుంటుంది.
ఒక ఉద్యోగి నెల రోజుల తర్వాత పదోన్నతి పొందే అవకాశం ఉందని తెలియగానే, ఆ రోజే వచ్చేసిన ట్టుగా సంబరపడిపోతుంటాడు. కొందరైతే మరింత ఉత్సుకతతో ప్రవర్తిస్తుంటా రు. మాటల్లోనూ, చేతల్లోనూ మార్పు కొనితెచ్చుకుంటారు. అయితే, రాబోయేవి నిజమో, కాదో తెలియకుండానే వాటితో మన మనసు లంకె వేసుకుని ఉంటుంది. అది సమర్థనీయం కాదు. ‘ఈ మానసిక లంకెలు వద్దు’ అని హెచ్చరించాడు గీతాచార్యుడు. ‘ప్రతిదీ అశాశ్వతం అన్నది సత్యం. ఆ అశాశ్వతాలతో లంకెలు వేసుకుని, దుఃఖపడటమో లేక సంతోషపడటమో చేయక, స్థితప్రజ్ఞులమై, విరాగబద్ధులమై, మోక్షాన్ని అనుభవించాల’ని గీతా ప్రబోధం.
పరిశీలించదగిన విశ్వంలో దాదాపుగా వేల కోట్ల నక్షత్ర మండలాలున్నాయని అంచనా. ఒక్కో మండలంలో రమారమి వందల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ లెక్కలేనంత ఉష్ణాన్ని విశ్వంలోకి వెలువరిస్తూ ఉన్నాయి. ఈ నక్షత్ర మండలాల నడుమ అత్యంత శీతల ప్రాంతాలూ ఉన్నాయి. ఈ ఉష్ణ శీతలాలను రెండింటినీ అనుభవిస్తున్నా ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంది. దానికి ఏ బాధా లేదు, ఏ సంతోషమూ లేదు. నిజానికి ఆ భావనలేవీ దానికి కలగడం లేదు. అదే ఆత్మ మనలోనూ అణువణువూ వ్యాప్తి చెంది ఉంది.
ఆ ఆత్మకు మన మనసు అనుభవించే సుఖదుఃఖాలతో సంబంధం లేదు. భూత, వర్తమాన, భవిష్యత్తులతో పనిలేదు. ‘నిశ్చలమైన, నిర్మలమైన, నిత్యమైన ఆత్మతో మన మనసు లంకె వేసుకోవాలి’ అని సూచించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘అడవికి పో!’ అని ఆదేశించగానే పద్నాలుగు సంవత్సరాల గురించి గానీ, అడవి గురించి గానీ చింతించక నార చీరలు ధరించి అడవికి పయనమైన రాముని మనసులా, మన మనసు నిరంజనమై వెలుగొందడమే మోక్షం. అది సాధించడానికి నిరంతరం ప్రయత్నించడమే మానవుడి కర్తవ్యం.
రావుల
నిరంజనాచారి