భగవద్గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు గీతా జయంతిగా చేసుకుంటారు. ఒక దివ్య గ్రంథానికి జయంతిని నిర్వహించడం అత్యంత అరుదైన విషయం. భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో వచ్చే కథా విషయం. దీనికి గీతోపనిషద్ అనే పేరు కూడా ఉన్నది. శ్రీకృష్ణుడి ఉపదేశం ఇరవై లక్షల ఏండ్ల ముందునుంచే సంఘంలో గీతాజ్ఞానంగా వ్యాప్తి చెంది ఉంది. అయితే, కాలక్రమంలో దాని ప్రాధాన్యాన్ని సమాజం విస్మరించింది. సమాజాన్ని ఉద్ధరించడానికి కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడిని నిమిత్తం చేసుకొని మళ్లీ గీతా సందేశాన్నిచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇందులో నాలుగు పాత్రలు మనకు కనిపిస్తాయి. ఆచార్యుడిగా శ్రీకృష్ణ భగవానుడు, విద్యార్థిగా అర్జునుడు, వీరితోపాటు యుద్ధరంగానికి దూరంగా అంతఃపురంలో కూర్చొని భగవద్గీతను విన్న సంజయుడు, అతని ద్వారా గీత వివరాలు తెలుసుకున్న ధృతరాష్ర్టుడు.
ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ ఏదో ఒక కర్మను నిరంతరం చేస్తూనే ఉంటాడు. అలా చేయక తప్పని పరిస్థితి. ‘నేను ఏ పనీ చేయవలసిన అవసరం లేదు. కూర్చునే ఉంటాను’ అని ఎవరైనా అన్నా.. అలా కూర్చోవడం కూడా ఒక కర్మే కదా! అయితే మనం చేసే ప్రతి కర్మా ఒక ఫలితాన్ని ఇస్తుంటుంది. వాటిలో కొన్ని సత్ఫలితాలను ఇస్తాయి! కొన్ని దుష్ఫలితాలూ రావచ్చు. అయితే, మనం చేసే పనులు విజయపథంలో సాగాలన్నా, మన ఓటమికి కారణాలు తెలుసుకోవాలన్నా, విజయానికి బాటలు పరుచుకోవాలన్నా భగవద్గీత అనుసరించడం కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. మనిషి మానసికంగా కుంగిపోయినప్పుడు కార్యవిముఖుడవుతాడు. తనలో ఎన్ని ప్రజ్ఞా పాటవాలు ఉన్నా.. మనసు చెదిరితే, ఆందోళనకు గురైతే కార్యదక్షతను కోల్పోతాడు. ఇలాంటి పరిస్థితే కురుక్షేత్ర సమరంలో అర్జునుడికి వచ్చింది. శ్రీకృష్ణుడు గీతా బోధ ద్వారా అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసి విజయపథంలో నడిపించాడు.
భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల శ్లోకాలున్నాయి. తొలి ఆరు అధ్యాయాలు మనిషిని బుద్ధిస్థితిలో నిలిపి కర్మయోగంలో నడిపిస్తాయి. అందుకే ఈ ఆరు అధ్యాయాలను కర్మషట్కంగా చెప్తారు. తర్వాతి ఆరు అధ్యాయాలు మనిషిని ఆత్మస్థితిలో నిలిపి భక్తియోగంలో నడిపిస్తాయి. అప్పుడు మనిషి మనసును, బుద్ధిని సమతుల్యం చేస్తూ నాయకుడిగా ఎదుగుతాడు. కర్మయోగం ద్వారా అతడు విజయశీలుడైతే, భక్తియోగం అతడిని అసాధారణమైన శక్తి కలిగిన నిజాయతీపరుడైన నాయకుడిగా నిలుపుతుంది. చివరి ఆరు అధ్యాయాలను జ్ఞానషట్కంగా అభివర్ణిస్తారు. వీటిలో పేర్కొన్న జ్ఞానం మనిషిని నిరంతరం అప్రమత్తం చేస్తుంది. తత్ఫలితంగా అతడు ధర్మమార్గంలో నడిచి పరిపూర్ణ నాయకుడిగా ఎదుగుతాడు. ఎన్నో అద్భుత విజయాలు సాధించి నాయకుడిగా ఎదిగి, ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పతనమైనవాళ్లు చరిత్రలో ఎందరో కనిపిస్తారు. కానీ, గీతా మార్గదర్శనంలో ధర్మాన్ని పాటిస్తూ నాయకుడిగా ఎదిగినవాడికి తిరోగమనం ఉండదు.
గీతా జయంతిని పురస్కరించుకొని ఈ రోజు సంపూర్ణ గీతా పారాయణం చేయాలి. శరీరం సహకరిస్తే ఉపవాస దీక్ష చేపట్టాలి. శ్లోకాలు చదవలేనివాళ్లు మహానుభావుల నుంచి గీతా శ్రవణం చేయాలి. భగవద్గీతపై ప్రామాణిక ప్రవచనాలు వినాలి. శక్తి ఉన్నవాళ్లు భగవద్గీత గ్రంథాలు దానం చేసి గీతాజ్ఞాన ప్రచారం నిర్వహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించాలి. గీతాపఠనం, శ్రవణం ద్వారా మనిషి ఒత్తిళ్లను జయించి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి విజయశీలుడు కావడం తథ్యం.
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ॥ (భగవద్గీత 18-78 )
‘యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో, మేటి విలుకాడైన అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఐశ్వర్యం, విజయం, అసాధారణ శక్తి, నీతి నిశ్చయంగా ఉంటాయి. ఇది నా అభిప్రాయం’ అని భగవద్గీతలో సంజయుడు పలికిన చివరి శ్లోకం అక్షర సత్యం. ఇదే గీత చరమ సందేశం!
డా॥ వైష్ణవాంఘ్రి
సేవక దాస్
98219 14642