ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చిన ఘట్టం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రాణాలపై ఆశలు కోల్పోయిన వాళ్లకు తమ జీవితం మళ్లీ చిగురిస్తుందనే నమ్మకాన్ని నింపే వృత్తాంతం ఇది. సంజీవ పర్వత ధారియైన హనుమంతుణ్ని వీరాంజనేయుడు అని పిలుస్తారు. నమస్కార ముద్రలో ఉంటే ‘పబ్బతి హనుమాండ్లు’ అంటారు. పబ్బతి పట్టడం అంటే నమస్కరించడం. పబ్బతి పదానికి మూలం సంస్కృత ప్రపత్తి. ఇంద్రజిత్తు సంధించిన శక్తిమంతమైన అస్ర్తానికి స్పృహ కోల్పోయిన లక్ష్మణుడు ప్రాణాపాయంలో పడతాడు. తన మూలంగా ‘తమ్ముడికి ఇంత కష్టం వచ్చింది కదా!’ అని దుఃఖిస్తాడు రాముడు. జాంబవంతుడి సలహా మేరకు హనుమంతుడు సంజీవనితోపాటు మరో మూడు వనమూలికల కోసం హిమాలయాల్లోని గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్తాడు. మారుతిని చూసి మూలికలు మాయమవుతాయి. దాంతో ఏకంగా కొండనే పెకలించుకొని వచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడతాడు.
మరో కథ ప్రకారం విభీషణుడి సలహా మేరకు హనుమంతుడు లంకలో రావణుడి ఆస్థాన వైద్యుడు సుషేణుడిని తీసుకువస్తాడు. హిమాలయాల్లో గంధమాదన పర్వతంపై ఉండే సంజీవని ఓషధిని తీసుకువస్తే సౌమిత్రి బతుకుతాడని సలహా ఇస్తాడు సుషేణుడు. అదీ సూర్యోదయానికి ముందు చికిత్స అందిస్తేనే! తన స్వామి తమ్ముణ్ని బతికించుకోవడానికి మారుతి ఆకాశమార్గంలో హిమాలయాలకు చేరుకుంటాడు. ఇదంతా రావణుడు గమనిస్తాడు. గంధమాదనం మీదికి కాలనేమి అనే మాయావిని పంపిస్తాడు. కాలనేమి మారుతిని తప్పుదారి పట్టిస్తాడు. ఆ కపటోపాయాన్ని కనిపెట్టిన హనుమ అతణ్ని సంహరిస్తాడు. చంద్రుడు అస్తమించకుండా, సూర్యుడు ఉదయించకుండా ఇద్దరినీ తన అధీనంలో ఉంచుకుంటాడు. సంజీవని మూలికను గుర్తించ లేకపోవడంతో ఏకంగా కొండనే పెకలించుకుని చేతిపై పెట్టుకుంటాడు. సూర్యోదయానికి ముందే లంకకు చేరుకొని లక్ష్మణుడికి చికిత్స చేయిస్తాడు. ప్రాణాలు కాపాడతాడు. తమ్ముడికి ప్రాణదానం చేసిన హనుమను ఆనందంతో హత్తుకుంటాడు శ్రీరాముడు. ఈ దృశ్యాన్నే తులసీదాసు ‘లాయ సజీవన లఖన జియాయే/ శ్రీరఘువీర హరషి ఉరలాయే’ అన్నాడు హనుమాన్ చాలీసాలో. సంజీవ పర్వతాన్ని ధరించిన హనుమంతుడు సంజీవరాయడిగా పూజలు అందుకుంటున్నాడు.
ఇలా ఉంటే, తన ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుడిని సంరక్షించిన హనుమను సోదర సమానుడిగా ఆదరిస్తాడు రాముడు. దీనినే… ‘రఘుపతి కీన్హీ బహుత బడాయీ/ తుమ మమ ప్రియ భరతహి సమభాయీ’… నీవు నాకు ప్రియమైన నా తమ్ముడు భరతుడితో సమానమైన వాడవు అని ఎంతో గొప్పగా ప్రశంసించాడు రాముడు అని పేర్కొన్నాడు తులసీదాసు. ప్రచారంలో ఉన్న మరో కథను అనుసరించి, సంజీవని పర్వతాన్ని చేతిలో పెట్టుకుని రామనామాన్ని ఉచ్చరిస్తూ హనుమ ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటాడు. అయోధ్య సమీపంలో భరతుడు ఈ దృశ్యాన్ని చూస్తాడు. మారుతిపైకి బాణాన్ని సంధించి నేలకు దిగేలా చేస్తాడు. అప్పుడు హనుమ వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులకు ఎదురైన పరిణామాలను భరతుడికి వివరిస్తాడు. సంభాషణ సుదీర్ఘంగా సాగడంతో సూర్యోదయం దగ్గరపడుతుంది. దాంతో వేగంగా వెళ్లేందుకు వీలుగా హనుమను తన బాణం అంచున కూర్చోమంటాడు భరతుడు. వింటినారిని సంధించి వదలగా హనుమ సమయానికి లంకకు చేరుకుంటాడు.
రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు భరతుడి మనసులో ఏముందో తెలుసుకోవాల్సిందిగా హనుమను కోరతాడు రాముడు. అప్పుడు హనుమ అయోధ్యకు వస్తాడు. భరతుడు తనకు సింహాసనంపై ఎలాంటి కోరికా లేదని వెల్లడిస్తాడు. ఈ సంఘటనలన్నీ మారుతిని రాముడు కేవలం బంటుగా మాత్రమే కాకుండా తన తమ్ముళ్లు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో సమానంగా చూశాడని తెలియజేస్తాయి. సంజీవనితో లక్ష్మణుడి ప్రాణాలు నిలబెట్టాడు కాబట్టి, హనుమంతుడు తమను వివిధ శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి బయట పడేస్తాడన్న నమ్మకం సామాన్యుల్లో పాతుకుపోయింది. అందుకే రోగాలను హరించే దేవుడిగా హనుమంతుణ్ని కొలుస్తారు.
చింతలపల్లి హర్షవర్ధన్