హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ‘తొలి వర్షానికే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థత, బాధ్యతారాహిత్యంతో నగరవాసులు నరకయాతన అనుభవించాల్సి వచ్చింది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షంతో ఎదురైన ఇబ్బందులను చక్కదిద్దాల్సిన సీఎం, తొలి వానకే హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని ఇంత నిర్లజ్జగా అంగీకరించడానికి సిగ్గనిపించడం లేదా? అని బుధవారం ఎక్స్ వేదికగా ఘాటుగా ప్రశ్నించారు. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అని, మున్సిపల్ శాఖ మంత్రి అనే విషయం కూడా రేవంత్రెడ్డి మరచిపోయినట్టున్నాడని ఎద్దేవా చేశారు. పొద్దంతా కాయకష్టంచేసి ఇండ్లకు తిరిగివెళ్లే సమయంలో కురిసిన వర్షానికి వాహనదారులు, ముఖ్యంగా ఆడబిడ్డలు అనేక కష్టాలు పడ్డారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సత్వర చర్యలు చేపట్టి గట్టెక్కించాల్సిన ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
వర్షానికి హైదరాబాద్వాసులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నాలుగు గంటల పాటు నరకయాతన పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఏటా వానకాలం ముందు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకొనేవారని గుర్తుచేశారు. విపత్కర సమయంలో చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టేవారని చెప్పారు. కానీ మున్సిపల్ మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని విరుచుకుపడ్డారు. చెత్తతో కూరుకుపోయిన డ్రైనేజీలు, సిల్ట్ పేరుకుపోయిన మురుగు కాలువలను శుద్ధి చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కేవలం రాజకీయాలు తప్ప ప్రజాసమస్యలు, నగర పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా చేయకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు.
వర్షాకాల ప్రణాళిక సన్నద్ధతపై నిర్లక్ష్యం చేయడం వల్లే హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికే దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ లాంటి పకడ్బందీ ప్రణాళికలను అమలు చేసి నగరవాసుల కష్టాలు తీర్చామని ఆయన గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ కథ మొదటికి తెచ్చిందని ఆరోపించారు. ఓ వైపు కరెంట్ కోతలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా, మరోవైపు విద్యుదాఘాతంతో మరణాలు సంభవిస్తున్నా ఈ సర్కార్లో చలనం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజధానిలో విలువైన భూములను కబ్జా చేయడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రానికే ఎకనమిక్ ఇంజిన్ అయిన హైదరాబాద్ను గాలికొదిలేసిన సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని తేల్చిచెప్పారు.