రామకృష్ణ పరమహంస వేదాంత సత్యాలను తాము అనుభూతి చెందడమే కాకుండా, శిష్యులు, భక్తులతో కూడా ఆ సత్యాలను ఆవిష్కరింపజేయగల ఆధ్యాత్మిక శక్తి సముద్రం. హైందవ ధర్మసాధనలనే కాదు, అన్యమత పారమార్థిక సాధనలను కూడా అనుష్ఠించారు. ఆ ఫలాలను పొంది, ఆ గ్రంథాల్లోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా జిజ్ఞాసువులకు పంచిన జ్ఞానవరిష్ఠులు. పరమహంస యోగి మాత్రమే కాదు, యోగీశ్వరుడు కూడా! జ్ఞాని మాత్రమే కాదు విజ్ఞాని కూడా! భవసాగరాన్ని దాటినవారే కాదు, పలువురిని దాటించగల పెద్ద ఓడ లాంటి గురువరేణ్యులు! సంచార ఆలయంగా ఎందరో పారమార్థిక అన్వేషకుల నీరాజనాలు అందుకున్నవారు.
‘ఆచరణాత్మకమైన మత కథనమే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర. వారి జీవన ఘట్టాలు మనకు భగవంతుడిని ముఖాముఖి దర్శింపజేయిస్తాయి. ఆ పరమహంస జీవితాన్ని చదివినవారందరూ ‘భగవంతుడే సత్యం. తక్కినదంతా అసత్యం’ అనే భావనకు రాకుండా ఉండలేరు’ అని జాతిపిత మహాత్మా గాంధీ కొనియాడారు. ‘నేను స్వయంగా ఎవరిని నా కండ్లతో చూశానో, ఎవరి నీడలో నేను జీవించి ఉన్నానో, ఎవరి పాదాల దగ్గర నేను సమస్తమూ నేర్చుకున్నానో, అలాంటి రామకృష్ణ వరమహంసుల వారి జీవితంతో సాటిరాగల దివ్యతేజోమయ జీవితం మరొకటి లేదు’ అని అంటారు ఆయన ప్రధాన శిష్యుడు వివేకానంద.
రామకృష్ణ పరమహంస జన్మించిన క్షణం నుంచి అన్ని భేదభావాలకు ముగింపు మొదలైంది. స్త్రీ పురుషుల మధ్య, ధనిక పేదల మధ్య, అక్షరాస్యులు నిరక్షరాస్యుల మధ్య, బ్రాహ్మణ బ్రాహ్మణేతరుల మధ్య వ్యత్యాసాలు రూపుమాపటానికే పరమహంస ఆవిర్భవించారు. ఈ కాలంలో ఆయన ప్రేమతరంగం అందరినీ పవిత్రం చేసింది. బుద్ధికుశలత, భావతీవ్రతల మేలు కలయిక అయిన ఒక విశ్వజనీన ధర్మానికి శ్రీకారం చుట్టడానికి రామకృష్ణుల జీవితం నాందీ ప్రస్తావన.
‘ఇనుమును అయస్కాంతం ఆకర్షించే తీరులో భగవంతుడు మనలను సర్వదా ఆకర్షిస్తూనే ఉన్నాడు. కానీ ఇనుమును మట్టితో కప్పివేసి ఉన్నప్పుడు అయస్కాంతం ఆకర్షించదు. మట్టిని కడిగివేసిన మరుక్షణమే అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. అలాగే మనసంతా మాలిన్యాల మట్టి ఆవరించి ఉంటే భగవంతుడి వైపు మొగ్గుచూపదు. అందుకే ముందు మనసు పునీతమైతే, పరమాత్మ ఆకర్షణకు నోచుకుంటుంది’ అనేవారు పరమహంస. ఆ మాటలు అక్షరసత్యాలు. మనసులో చింతను తొలగించిన మరుక్షణం చింతన మొదలవుతుంది. సాధన తీవ్రమవుతుంది. భగవత్ అనుగ్రహమూ లభిస్తుంది.
‘మీరు సంసారంలో ఉన్నంతకాలం భగవంతునికి మీ ముఖ్తార్ నామా (పవర్ ఆఫ్ అటార్ని) ఇచ్చేయండి. మీ బాధ్యతలన్నీ ఆయన పరం చేయండి. ఆయన ఇచ్ఛ మేరకు నిర్వర్తిస్తాడు. ధనవంతుని ఇంటి దాసీలాగా ఈ సంసారంలో జీవించండి. ఆమె తన యజమాని పిల్లలకు స్నానం చేయిస్తుంది.
ఆహారం తినిపిస్తుంది. వారు తన సంతానమే అన్నట్లుగా వాత్సల్యంతో అనేక విధాలుగా వారి ఆలనాపాలన చూసుకుంటుంది! కానీ వారు తన పిల్లలు కారనే విషయం ఆమెకు తెలుసు. అలాగే మనమూ ఈ లోకంలో మసలుకోవాలి’ అంటారు రామకృష్ణులు. రాగద్వేషాలు, సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు, అనుమానాలు ఇవన్నీ తాత్కాలికమైనవే. ఏదీ స్థిరంగా ఉండదు. అన్నీ వచ్చిపోయేవే! ఈ అనుభవాలన్నింటినీ మనసులో దాచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
దేవుడికి కావలసింది ఆర్భాటాలు కాదు, శుద్ధభక్తి అని చెప్తుండేవారు పరమహంస. ఆవుకు ‘పశుగ్రాసం, గానుగపిండి ఆవుకు రుచించే విధంగా భగవంతుడికి పేదల, దీనుల భక్తి ఎంతో రుచిస్తుంది. సర్వేశ్వరుడు కోరుకునేది సరళతను, శుద్ధభక్తిని. రారాజు దుర్యోధనుడు తన సిరిసంపదల వైభవాన్ని చూపి, శ్రీకృష్ణుడిని తన మందిరానికి ఆహ్వానిస్తాడు. కానీ, వాసుదేవుడు పేదవాడైన విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. భగవంతుడు భక్త వత్సలుడు. దూడ వెంట పరుగెత్తే ఆవులా భగవంతుడు భక్తుడి వెంటపడి పోతూ ఉంటాడు’ అని రామకృష్ణులు చేసిన హితబోధ నిజమైన భక్తులను భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియజేస్తుంది.
– మనోజ్ఞ
నేడు ,రామకృష్ణ
పరమహంస ,జయంతి