రైతుకు ఎక్కువ ఆదాయం అందించే పంటల్లో ‘మిర్చీ’ది అగ్రస్థానం. దీనికి 365 రోజులూ డిమాండ్ ఉంటుంది. అయితే, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో, తోటలను కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వాటిని నివారించి, అధిక దిగుబడి పొందే అవకాశాలు ఉంటాయి.
తామర పురుగులు : మిరపను అన్ని దశల్లోనూ తామర పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఇవి పూతపై ఎక్కువగా దాడి చేస్తాయి. ఫలితంగా పూత రాలి, కాయగా మారకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే, వీటిని నివారించడానికి ఎక్కువగా పురుగు మందులను కొడుతుంటారు. దీనివల్ల తామర పురుగుల్లో గుడ్లు పెట్టే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే, సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్ మందులను ఎక్కువగా పిచికారీ చేయకూడదు. అలాగే, జిగురు పూసిన నీలిరంగు, పసుపు రంగు అట్టలను ఎక్కువ సంఖ్యలో పొలంలో పెట్టుకోవడం ద్వారా, తల్లి పురుగులను నివారించవచ్చు.
తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడానికి వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. ఇందుకోసం వేపనూనె 1000 పి.పి.ఎం. లీటర్ నీటిలో 3 మి.లీ. + 0.5గ్రా. సర్ఫ్ కలిపి పిచికారీ చేయాలి.
ఎకరం తోటలో ఎసిటామిప్రిడ్ 40 గ్రా. నుంచి 50 గ్రా. లేదా సైయాంట్రినిలిప్రోల్ 240 మి.లీ. లేదా ఫొప్రోనిల్ 40 గ్రా. నుంచి 50 గ్రా. లేదా ఫిప్రోనిల్ + ఇమిడాక్లోప్రిడ్ 40 గ్రా. నుంచి 50గ్రా. మందులను నాలుగు రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారీ చేయడం ద్వారా తామర పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
నల్లి : ఈ పురుగులు ఆకుల రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా ఆకులు గిడసబారి, ముదురు ఆకుల కాడలు పొడవుగా సాగి కిందికి ముడుచుకుంటాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువ అయితే, పూత రాలిపోయి కాపు గణనీయంగా తగ్గుతుంది. వీటి నివారణకు లీటర్ నీటిలో 0.5 మి.లీ. ఫెన్ ఫాత్రిన్ లేదా 3 మి.లీ. ఇథియాన్ లేదా 2.5 మి.లీ. ప్రొఫార్జెట్ లేదా 2 మి.లీ. క్లోరోఫెన్ ఫైర్ కలిపి పిచికారీ చేయాలి.
పూత పురుగు : ఇది పిందె దశలో ఆశిస్తుంది. దీనివల్ల కాయలు గిడసబారి, గింజలు లేకుండా త్వరగా పండుబారిపోతాయి. పూత, కాత విపరీతంగా రాలుతుంది. కాయలు వంకర్లు తిరిగి, నాణ్యత లేకుండా పోతాయి. దీని నివారణకు ఎకరం తోట కోసం 250 మి.లీ. ట్రైజోఫాస్ + వేపనూనె (1500 పి.పి.ఎం) 500 మి.లీ. కలుపుకొని పిచికారీ చేయాలి. వారం రోజుల తర్వాత 400 మి.లీ. కార్బోసల్ఫాన్ పిచికారీ చేయాలి.
కాయ తొలిచే పురుగులు : ఈ పురుగు లార్వాలు ఆకులను చిన్న చిన్న రంధ్రాలు చేసి, జల్లెడగా మారుస్తాయి. కాయ దశలో కాయలను ఆశించి, లోపలి గింజలను, గుజ్జును తింటాయి. దీని నివారణ కోసం ఎర పంటగా ఆముదం, బంతి మొక్కలను తోటలో అక్కడక్కడా నాటుకోవాలి. లేదా లీటర్ నీటిలో 0.3 మి.లీ. క్లోరాంట్రనిప్రోల్ లేదా 0.3 మి.లీ. ఫ్లూబెండమైడ్ లేదా 0.4 ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 1 గ్రా. థయోడికార్బ్ లేదా 0.75 మి.లీ. నొవాల్యూరాన్ లేదా 0.8 మి.లీ. ఇండాక్సాకార్బ్ లేదా 1.2 గ్రా. సైయాన్ట్రానిలిప్రోల్ కలిపి పిచికారీ చేయాలి.
నులి పురుగులు : నులి పురుగులు ఆశించిన మొక్కలు వడలి, ఎండిపోతాయి. ఇవి మొక్కల వేర్లలోని కణజాలాన్ని ఆశించి, మొక్కకు అందాల్సిన పోషకాలను పీల్చుకుంటాయి. ఈ క్రిములు కలుగజేసే గాయాల వల్ల శిలీంధ్రాలు ప్రవేశించి, ఎండు తెగులునూ కలుగజేస్తాయి. వీటి నివారణకు ఆశించిన తోటల్లో 200 కిలోల వేపపిండి వేయాలి. ఎకరానికి 12-15 కిలోల వరకు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేసుకోవాలి.
కొమ్మకుళ్లు : కొమ్మల చివర్ల నుంచి కిందికి వ్యాపించడం ఈ తెగులు లక్షణం. లేత కొమ్మలను, పూతను ఆశించడం వలన పూత రాలిపోతుంది. కుళ్లిన కొమ్మల భాగాలపై శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. దీని నివారణకు 10 లీటర్ల నీటిలో 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1గ్రా. స్ప్రెప్టోసైక్లిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా లీటర్ నీటిలో 1 మి.లీ. అజాక్సీస్ట్రోబిన్ కలిపి పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు : ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలిపోయి, పూత, పిందె, ఆకులు రాలిపోతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల పైనుంచి ఇతర మొక్కలకు నీటి తడులు ఇవ్వకూడదు. అలా చేస్తే.. ఈ తెగులు త్వరగా ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది. దీని నివారణ కోసం 10 లీటర్ల నీటిలో 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ కలిపి మొక్కల మొదళ్లలో వేరు భాగమంతా తడిచేలా పోయాలి. వారం వ్యవధిలో రెండుమూడు సార్లు పునరావృతం చేయాలి.