హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోళ్ల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆవిర్భావ సంబురాల్లో మనం ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్రబుద్ధితో ఏడు మండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్టును దుర్మార్గంగా ఎత్తుకెళ్లి, నీచమైన సంస్కృతిని ప్రదర్శించిందని గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణభవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సాయంత్రం 4 గంటల నుంచి 6.30 దాకా రెండున్నర గంటలపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరి, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ అవగాహన కల్పించారు. ప్రభుత్వంగా కేంద్రం వైఖరిని, పార్టీగా బీజేపీ నేతల దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు, ఎక్కడిక్కడ ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ పురోగతిపై..
ఏడేండ్లలో వ్యవసాయరంగ పురోభివృద్ధికి, రైతు కేంద్రంగా చేపట్టిన పథకాల నేపథ్యాన్ని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు వివరించారు. వివిధ రాష్ర్టా ల్లో పండే పంటలు, వాతావరణ పరిస్థితులకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసంపై అవగాహన కల్పించారు. పారిశ్రామికీకరణ ద్వారా నే అభివృద్ధి సాధ్యమనే తప్పుడు ఆలోచనలకు భిన్నంగా రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి,అద్భుతమైన పురోగతిని సాధించామని వివరించారు. రైతుల సంతోషాన్ని చెడగొట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎఫ్సీఐ ఏర్పాటు నేపథ్యా న్ని వివరించారు. కేంద్రం బాధ్యతను విస్మరించటమే కాకుండా ప్రజలను, ప్రత్యేకించి రైతులను గందరగోళానికి గురిచేస్తున్నదని చెప్పారు. దీనిపై మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాకుండా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ గళం విప్పాలని సూచించారు.
రెండు పంటలు వడ్లు పండే రాష్ట్రాలు రెండే
దేశంలో తెలుగు రాష్ర్టాలు తప్ప మరే రాష్ట్రంలో రెండు పంటలు వరి పండదని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు పంటల్లో వచ్చిన వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? అని బీజేపీని సూటిగా ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలనే బీజేపీ దుర్మార్గ విధానానికి తగిన బుద్ధి చెప్పాలని దిశానిర్దేశం చేశారు.
త్వరలో పార్టీ శ్రేణులకు శిక్షణ
త్వరలో టీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు తెలంగాణ భవన్లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రోజుకు కొన్ని నియోజకవర్గాల చొప్పున శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘అనేక రంగాల్లో టీఆర్ఎస్ దేశానికి మార్గదర్శనం చేసింది. ఇన్ని చేసినా మనం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పటంలో వెనుకబడిపోయాం. ఇక నుంచి ఆలా కావటానికి వీల్లేదు’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులతోపాటు పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అబద్ధాలను తిప్పికొట్టాలి
బీజేపీ అనుసరిస్తున్న నీచమైన వైఖరిని తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో అసత్యాలు ప్రచారం చేస్తున్నదని, ఈ నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియాను బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆర్బీఐ గణాంకాలతో స్పష్టం చేసిందని, దేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో నిలవడం వెనుక వ్యవసాయ రంగం పాత్ర, రైతుల కష్టం ఉన్నదని వివరించారు. రాష్ట్రం పచ్చబడటం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం ఇష్టం లేని బీజేపీ నేతలు వక్రబుద్ధితో, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని చెప్పారు. పార్టీ అన్ని శ్రేణులు ప్రజలకు వాస్తవాలు చెప్పి, బీజేపీ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. రైతుల జోలికి వచ్చినా, రైతులకు నష్టం చేయాలని చూసినా టీఆర్ఎస్ ఉపేక్షించదనే స్పష్టమైన సంకేతాలు పోయేలా పార్టీ శ్రేణులు వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.11,500 కోట్ల నష్టం వాటిల్లినా ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటికీ కేంద్రం నుంచి నయా పైసా రాలేదని వివరించారు.
రైతుల జోలికి వచ్చినా, రైతులకు నష్టం చేయాలని చూసినా టీఆర్ఎస్ ఉపేక్షించదనే స్పష్టమైన సంకేతాలు పోయేలా పార్టీ శ్రేణులు వ్యవహరించాలి. ప్రభుత్వంగా కేంద్రం వైఖరిని, పార్టీగా బీజేపీ నేతల దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు, ఎక్కడిక్కడ ప్రజలకు వివరించాలి.