న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: టాటా గ్రూప్ కంపెనీలకు మాతృసంస్థ టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. శుక్రవారం సమావేశమైన టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు గత ఐదేండ్లలో చంద్రశేఖరన్ పనితీరును సమీక్షించి, పునర్నియమించాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. మరో ఐదేండ్లు ఆయన టాటా సన్స్ చైర్మన్గా కొనసాగుతారు. బోర్డు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన టాటా ట్రస్ట్ల చైర్మన్ రతన్ టాటా…చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా గ్రూప్ సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు తాజాగా విడుదలైన ప్రకటన తెలిపింది. చంద్రశేఖరన్ను మరో ఐదేండ్లు నియమించాలని రతన్ టాటా సిఫార్సుచేసినట్టు ప్రకటన పేర్కొంది. టాటా సన్స్లో మెజారిటీ వాటా టాటా ట్రస్టుల చేతిలో ఉన్నది. మరో దఫా టాటా గ్రూప్ను నడిపించే అవకాశం వచ్చినందుకు చంద్రశేఖరన్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తంచేశారు.
టీసీఎస్ నుంచి..
బిజినెస్, మీడియా సర్కిళ్లలో ‘చంద్ర’గా పిలివబడే ఆయన 2017లో టాటా సన్స్ నాయకత్వ సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ పదవిని చేపట్టారు. రతన్ టాటా పదవీ విరమణ అనంతరం పగ్గాలు చేపట్టిన సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ తొలగించిన తర్వాత చంద్రను నియమించారు. అప్పటివరకూ టాటా గ్రూప్నకు తలమానికంగా ఉన్న టీసీఎస్కు ఆయన ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక టాటా స్టీల్, టాటా మోటర్స్, టాటా పవర్, టీసీఎస్ తదితర కంపెనీలకు సైతం చైర్మన్గా కొనసాగుతున్నారు. టాటాలకు విశ్వసనీయుడిగా పేరొందిన చంద్ర పదవీకాలంలో చాలావరకూ మిస్త్రీతో న్యాయపోరాటంలోనే గడిచింది.
సూపర్ యాప్ రూపకల్పన
అన్ని వినియోగ వస్తువులు, సర్వీసుల్ని అందించే ఆల్-ఇన్-ఒన్ ఈ-కామర్స్ సూపర్ యాప్ చంద్రశేఖరన్ కీలక ప్రాజెక్టుల్లో ఒకటి. ప్రస్తుతం టాటా గ్రూప్ ఈ యాప్ రూపొందిస్తున్నది. అలాగే చంద్ర నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను ఇటీవల టాటా గ్రూప్ కొనుగోలు చేసి, విమానయాన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నది. టాటా గ్రూప్ అతిపెద్ద టేకోవర్… భూషన్ స్టీల్ను రూ. 35,200 కోట్లకు 2018లో కొన్నది. అటుతర్వాత ఆ కంపెనీ పేరును టాటా స్టీల్ బీఎస్ఎల్గా మార్చి, చంద్ర ఆధ్వర్యంలో లాభదాయకంగా మలిచింది. నష్టాల్ని తగ్గించడంలో భాగంగా టాటా టెలిసర్వీసెస్కు చెందిన మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని భారతి ఎయిర్టెల్కు చంద్ర విక్రయించారు. ఉప్పు నుంచి విమాన టికెట్ల వరకూ అన్నింటినీ వినియోగదారులకు నేరుగా విక్రయించే సూపర్ యాప్ను ప్రారంభించే డిజిటల్ పక్రియకు గతేడాది చంద్ర శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 2021 మే నెలలో బిగ్ బాస్కెట్ను టాటా సన్స్ రూ. 9,500 కోట్లకు కొన్నది. చంద్ర నాయకత్వంలో టాటా మోటార్స్ వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గగా, పునరుత్పాదక ఇంధన వ్యాపారం నుంచి విలువను వెలికితీసేందుకు టాటా పవర్ కసరత్తు మొదలుపెట్టింది.