రాష్ట్రంలో 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం
పలు జిల్లాల్లో కురిసిన తేలికపాటి వానలు
హైదరాబాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచి కొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశంలో మబ్బులు కమ్మి వర్షం పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, కామారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా షాబాద్లో 3.23 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొన్నది. ఈ నెల 23, 24 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 39.9 డిగ్రీలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 36.8 నుంచి 39.9 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్డీపీఎస్ వెల్లడించింది. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో అత్యధికంగా 39.9, రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. వికారాబాద్లో అత్యల్పంగా 16.9 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డయినట్టు పేర్కొన్నది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మరఠ్వాడ మీదుగా కర్ణాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.