రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తే ప్రజల వెంటే ఉంటామన్నారు. మంచి పనులు చేస్తే మా వంతు సహకారం అందిస్తామని, అంతేగానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కొట్లాడుతామని చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు మిగతా అధికారులందరూ ఎవరి కనుసన్నల్లో పని చేస్తున్నారో జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. కలెక్టర్ అనాలోచిత నిర్ణయం వల్ల లక్ష మంది పాడి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్ మూసివేయడం వల్ల రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పాడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాడి పరిశ్రమ, మిల్క్ కూలింగ్ సెంటర్ అనేది సహకార సంఘం అనేది ఏ ఒక్కరి ఆస్తి కాదని, అందరి ఉమ్మడి ఆస్తి అని గుర్తుంచుకోవాలని చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచించారు. జిల్లాల్లో ఎవరి ఆదేశాల మేరకు పాలన కొనసాగుతుంది.. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు వేములవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆసుపత్రి మూసివేత, టీ స్టాల్ మూసివేత, పాలకేంద్రం మూసివేతలు, ఆర్ఎంపీ క్లినిక్ పై దాడులు కక్ష్య పూరితంగా జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు చక్కటి పాలన అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులపై ఇప్పటి వరకు ఓపిక పట్టామని, ఇకపై జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని.. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతామని స్పష్టం చేశారు.