హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది. వీటి నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఏపీకి చెందిన పలువురు రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా, రూ.920 కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం తాగునీటి పనులనే నిర్వహిస్తున్నామని, అన్ని అనుమతులు తీసుకొన్నా జరిమానా విధించడం సరికాదని సూచించారు. ఎన్జీటీ తీర్పును కొట్టేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.