హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొత్తం మీద మోదీ సర్కారు గ్యాస్బండపై సబ్సిడీకి సున్నా చుట్టేయబోతున్నది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి 300-400 వరకు ఉన్న సబ్సిడీని కొంచెం కొంచెంగా కోత పెడుతూ వస్తున్న కేంద్రం.. త్వరలో దీనిని మాయం చేయనున్నది. ఈ ఏడాది బడ్జెట్లో సబ్సిడీ కేటాయింపులు పూర్తిగా నామమాత్రం చేసేసింది. గత ఏడాది రూ.3,400 కోట్ల కేటాయింపులతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో రూ.4 వేల కోట్లకు పెంచినట్టు కనిపించినా.. ధరలు పెంచి సామాన్యుడి ఖాతాలోకి వచ్చే నగదు బదిలీ రూ.18కి పరిమితం చేసింది. మోదీ అధికారంలోకి రాక ముందు గ్యాస్ బండపై సబ్సిడీని మినహాయించి మిగతా డబ్బునే వసూలు చేసేవారు. 2015 నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పేరుతో మొత్తం డబ్బు వసూలు చేసి.. సబ్సిడీని ఖాతాలో వేయడం మొదలుపెట్టింది. ఇది మొదలు కేంద్రానికి ఇష్టం వచ్చినట్టు సబ్సిడీపై కోతలు విధించేందుకు వీలు కలిగింది. వినియోగదారుడికి తెలిసీ తెలియకుండానే సబ్సిడీ తగ్గిపోవడం మొదలైంది. గ్యాస్బండ ధరను అడ్డగోలుగా పెంచడం.. సబ్సిడీ మొత్తాన్ని మాత్రం పెంచకపోవడంతో.. వినియోగదారుడిపై భారం పెరిగిపోయింది. ఖమ్మంలో గ్యాస్ ధర రూ.930 కాగా.. వస్తున్న సబ్సిడీ రూ.18 మాత్రమే. హైదరాబాద్లో రూ.40 వస్తున్నది. ఇప్పుడు ఆ మొత్తం కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్యాస్బండ ధర 2014లో రూ.414. ఇప్పుడు అదే గ్యాస్ ధర రూ.952. ఏడేండ్ల కాలంలో ఏకంగా రూ.538కి పెరిగింది. ప్రతినెలా రూ.వెయ్యి వరకు గ్యాస్కే వెచ్చించాల్సి వస్తుండటం గమనార్హం. దీంతో సామాన్యుల వంటింట్లో మంటలు రేగుతున్నాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయితే.. ఈ రూ.18 కూడా సున్నా అయ్యే అవకాశం ఉన్నది.