హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడుకొంటున్నా. పాలమీద ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఎత్తేయండి. మానవీయ కోణంలో బీడీ కార్మికులను బతికించడానికి జీఎస్టీ తీసేయండి. ఈ దేశంలో కోటానుకోట్ల చేనేత కార్మికులు ఉన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు మేం బీమా ఇస్తున్నాం. 80 వేల కార్మికులకు ఇది వర్తిస్తున్నది. వాళ్ల మీద కూడా జీఎస్టీ వేశారు.
చేనేత మీద కూడా జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గాలికి తప్ప అన్నింటికీ పన్ను పడుతుంది.. ఇదేం అన్యాయం. ఇది చాలా దౌర్భగ్యమైన పన్నుల విధానం.. ఏ మాత్రం కరెక్ట్ కాదు.. దేశానికి మంచిది కాదు. ఎవరైతే విధివంచితులు, పేదలు, నిరుపేదలున్నారో వారిని ఆదుకొనే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటది. మీరు ఇవ్వకున్నా ఎవరైనా రాష్ట్రంలో ఇస్తామంటే వారి కాళ్లు చేతులు కట్టేస్తున్నారు’ అంటూ సీఎం కేసీఆర్ కేంద్రంపై మండి పడ్డారు.