న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూములు, కీలకేతర ఆస్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. భూముల అమ్మక ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ)ను ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పటివరకు ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్, బీఅండ్ఆర్, బీఈఎంఎల్, హెచ్ఎంటీ, ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ సహా వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (సీపీఎస్ఈ)లు 3,400 ఎకరాల భూములను, ఇతర కీలకేతర ఆస్తులను అమ్మకానికి రిఫర్ చేసినట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆస్తుల అమ్మకం ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్టు తెలిపింది. సీపీఎస్ఈలకు చెందిన భూములను, ఇతర కీలకేతర ఆస్తుల అమ్మకం ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్లో ప్రకటించారు. దీనికి అనుగుణంగా రూ.5 వేల కోట్ల ఇనీషియల్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్తోపాటు రూ.150 కోట్ల సబ్స్ర్కైబ్డ్ షేర్ క్యాపిటల్తో పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వాధీన సంస్థగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటైనట్టు ఆర్థిక సర్వే పేర్కొన్నది. దీని ద్వారా రానున్న నాలుగేండ్లలో (2021-22 నుంచి 2024-25 వరకు) మొత్తం రూ.6 లక్షల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మొత్తం విలువలో టాప్-5 రంగాల (రోడ్లు, రైల్వేలు, విద్యుత్తు, ఆయిల్-గ్యాస్ పైప్లైన్లు, టెలికం) ఆస్తుల విలువే 83% ఉంటుందని అంచనా.