మెట్రో ఎక్కడుంది.. హైదరాబాద్లోనా? అయితే ఫైల్ పక్కన పడేయండి. వీజీఎఫ్ నిధులివ్వాలా.. లైట్ తీస్కోండి. లేఖలు రాశారా.. మాకు లెక్క లేదు. ఇదీ.. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష. ఇతర రాష్ర్టాల్లోని మెట్రోలకు నిధుల వరద పారిస్తున్న మోదీ సర్కారు తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నది. మూడేండ్లుగా వీజీఎఫ్ నిధులను ఎగ్గొట్టింది. హైదరాబాద్ మెట్రోకు స్వయంగా ప్రధాని మోదీయే రిబ్బన్ కట్ చేశారు అని అంటే.. దానర్థం ప్రాజెక్టుకు కేంద్రం కటీఫ్ చెప్పినట్టేగా అన్నట్టు వ్యవహరిస్తున్నది. మరి ఆ నిధులను రాష్ట్ర బీజేపీ నేతలు తెస్తారా? మోదీ ఇస్తారా?
అది 2017, నవంబర్ 29.. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్లో రిబ్బన్ కట్చేసి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ సమాజం సంతోషపడింది. ఒక గొప్ప ప్రాజెక్టు దేశ ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితమైందంటే, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందుతాయని ఆశించింది. కానీ ఆ రిబ్బన్ కట్తోనే కేంద్రం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కటీఫ్ చెప్పింది. అప్పటివరకు ఏటా వచ్చిన వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కూడా రావడం ఆగిపోయింది.
మూడేండ్లుగా వీజీఎఫ్ నిధులివ్వకుండా కేంద్రం మొండికేస్తున్నది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు అడిగిందే తడవుగా కోట్లకొద్దీ నిధులిస్తున్నది. గతేడాది బెంగళూరు సహా దేశంలోని ఐదు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల రెండో దశకు నిధుల వరద పారించింది. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై ఇంత కక్ష దేనికి? ఇంత మోసం జరుగుతున్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నట్టు?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 25 : అది 2017, నవంబర్ 29.. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్లో రిబ్బన్ కట్చేసి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ సమాజం సంతోషపడింది. ఒక గొప్ప ప్రాజెక్టు దేశ ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితమైందంటే, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందుతాయని ఆశించింది. కానీ ఆ రిబ్బన్ కట్తోనే కేంద్రం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కటీఫ్ చెప్పింది. అప్పటివరకు ఏటా వచ్చిన వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కూడా రావడం ఆగిపోయింది. మూడేండ్లుగా వీజీఎఫ్ నిధులివ్వకుండా కేంద్రం మొండికేస్తున్న. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు అడిగిందే తడవుగా కోట్లకొద్దీ నిధులిస్తున్నది. గతేడాది బెంగళూరు సహా దేశంలోని ఐదు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల రెండో దశకు నిధుల వరద పారించింది. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై ఇంత కక్ష దేనికి? ఇంత మోసం జరుగుతున్నా తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నట్టు?
ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు
హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్ర ప్రభుత్వం ఆది నుంచీ నిర్లక్ష్యమే ప్రదర్శిస్తున్నది. 2007లో రూపొందించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,100 కోట్లు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టు. ఇందులో పది శాతం అంటే రూ.1,458 కోట్లు కేంద్రం వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద సమకూర్చేందుకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకున్నది. మూడు మార్గాల్లో 69.2 కిలోమీటర్ల మేర నిర్మించిన (ఫలక్నుమా వరకు కలుపుకొని 72 కిలోమీటర్లు) ఈ మెట్రో ప్రాజెక్టు దేశంలో రెండో అతి పెద్దది. ఢిల్లీ తర్వాత ఇంత పొడవున ఉన్న మెట్రో ప్రాజెక్టు ఇదే. 2017లో ఒక మార్గం ప్రధాని చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 2019లో పూర్తిస్థాయిలో 69.2 కిలోమీటర్ల మేర ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పనులు పూర్తవుతున్న దానికి అనుగుణంగా వీజీఎఫ్ నిధులను విడుదల చేయాలి. గతంలో నిధుల విడుదల సక్రమంగానే కొనసాగింది. గత మూడేండ్లుగా కేంద్ర ప్రభుత్వం నయాపైసా విడుదల చేయడంలేదు.
ఎన్ని లేఖలు రాసినా శూన్య హస్తమే
మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,458 కోట్లలో రూ.1,204 కోట్లు వచ్చాయి. మిగిలిన రూ.254 కోట్లు నిలిచిపోయాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు లేఖలు రాసినా ఎలాంటి ఫలితం లేదు. మంత్రి కేటీఆర్ దీనిపై కేంద్రానికి అనేకసార్లు లేఖలు రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం లేఖలు రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ కూడా కేంద్రం దృష్టికి పలుసార్లు తీసుకువెళ్లి వీజీఎఫ్ నిధులు విడుదల చేయాల్సిందిగా కోరింది. కానీ కేంద్రం నుంచి రిక్త హస్తమే ఎదురైంది.
ఇతర రాష్ర్టాలకు నిధుల భోజ్యం
హైదరాబాద్ మెట్రోకు రావాల్సిన రూ.254 కోట్ల వీజీఎఫ్ను మూడేండ్లుగా పెండింగ్లో పెట్టిన బీజేపీ ప్రభుత్వం, ఇతర రాష్ర్టాల్లోని మెట్రోలకు నిధుల వరద పారిస్తున్నది. 2020-21 బడ్జెట్లో దేశంలోని ఆరు మెట్రో ప్రాజెక్టులపై కాసుల వర్షం కురిపించింది. కొచ్చి, బెంగళూరు, చెన్నై, నాగపూర్, నాసిక్లో మెట్రో రెండో దశ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇదంతా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీల సాక్షిగా జరిగినా ఏ ఒక్కరూ ఇదేం వివక్ష? అని అడగలేదు. మెట్రోకు హక్కుభుక్తుంగా రావాల్సిన నిధులే ఇవ్వని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు సాయం చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వరంగల్ మెట్రో-నియో పైనా చిన్నచూపే…
కేంద్రంలో బీజేపీ సర్కారు కేవలం హైదరాబాద్ మెట్రోనే కాదు… వరంగల్పైనా చిన్నచూపే ప్రదర్శిస్తున్నది. వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరుచేయాలని ప్రభుత్వం అనేకమార్లు కోరింది. ఇటీవల రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా నియో ప్రాజెక్టుకు ఆసరా కావాలని విన్నవించారు. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు ఇదివరకే సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కేంద్రం అంచనా వ్యయంలో 20 శాతంగా రూ.184 కోట్లు మంజూరుచేయాలని కోరారు. బెంగళూరు, చెన్నై, కొచ్చి, నాగపూర్ వంటి నగరాల్లో మెట్రో రెండో దశకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం దీనివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎన్నికలొచ్చినపుడు సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు ఏ ఒక్కనాడైనా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోయిన దాఖలాలు లేవు.
మరి ఈసారైనా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు నిధులు తెస్తారా? మోదీ ఇస్తారా?