మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర సర్కారు తీవ్ర అన్యాయం
24 వేల కోట్లివ్వాలన్న నీతిఆయోగ్
ఐదేండ్లు గడుస్తున్నా రూపాయి రాలే
నలుగురు బీజేపీ ఎంపీలున్నా తేలే
మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ!! ఆలోచనలు మనవి.. కార్యాచరణ ప్రణాళికలు మనవి! మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కార్యక్రమాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తుంటాయి! ఏకంగా కేంద్ర ప్రభుత్వం మన పథకాన్ని కాపీకొట్టి.. దేశవ్యాప్తంగా అమలు చేస్తుంటుంది! కానీ.. ఈ పథకాలకు ఆర్థికంగా సహాయం చేయాలని కేంద్రాన్ని కోరితే.. అబ్బే.. ప్రశంసలు అంటే దండిగా కురిపిస్తాం కానీ.. డబ్బులడిగితే ఎట్లా? అన్నట్టు వ్యవహరిస్తుంటుంది! పోనీ.. ఇవే పథకాలను.. ఎంతో గొప్పవని, ప్రయోజనకారిగా ఉంటాయని, సహకరించి భుజం తడితే.. మరింత గొప్పగా అమలవుతాయని నీతి ఆయోగ్ చెప్పినా.. ఆ మాటలు బుట్టదాఖలే!
ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు నీతిఆయోగ్ సిఫారసు చేసినట్టు నిధులు తెస్తారా? మోదీ ఇస్తారా?
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు.. గొలుసుకట్టు చెరువులకు తిరిగి ప్రాణం పోసి వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆరేండ్లుగా అన్యాయం చేస్తున్నది. పైకి పొగడ్తల జడివాన కురిపిస్తూ.. పైసల దగ్గరికి వచ్చేసరికి మాత్రం పిసినారితనం ప్రదర్శిస్తున్నది. కేంద్రం నుంచి రాష్ర్టానికి ఎన్నో తెప్పిస్తున్నామని చెప్పే ఎంపీలు నీతి ఆయోగ్ చెప్పిన మేరకైనా నిధులు తేగలిగారా?
2016… నీతిఆయోగ్ తెలంగాణలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను పరిశీలించింది. తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణ, ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు అద్భుతమైన పథకాలు చేపట్టిందని ప్రశంసించింది. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.ఐదువేల కోట్లు ఆర్థిక సాయం చేయాలని సూచించింది. ఆరేండ్లు గడుస్తున్నా రూ.24 వేల కోట్లు కాదు కదా.. ఇప్పటికీ కనీసం 24 పైసలు కూడా ఇవ్వలేదు.
2016 ఆగస్టు 7.. గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటి బండదగ్గర స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మిషన్ భగీరథను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి గురించి, జల వనరుల గురించే ఆలోచిస్తారని ప్రశంసించారు. ఆ తర్వాత ఈ ఐదేండ్లలో ఎందరో కేంద్ర మంత్రులు, వివిధ స్థాయిల అధికారులు మిషన్ భగీరథను కొనియడారు. పైసా ఖర్చు లేని ప్రశంసలు తప్ప.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు.
హైదరాబాద్, జనవరి 23: భారీ వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండేండ్లపాటు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. 2015-19 ఆర్థిక సంవత్సరాలకు రూ.30,571 కోట్లు ప్యాకేజీ ఇవ్వాలని 2016 ఫిబ్రవరి 11న స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాకు సైతం విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ కృషి ఫలించి అదే ఏడాది ఏప్రిల్ 12 న ఏకే జైన్ నేతృత్వంలోని నీతిఆయోగ్ బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై అధ్యయనం చేసింది. మిషన్ కాకతీయ కింద రూ.20 వేల కోట్లతో 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరిస్తున్నామని.. మిషన్ భగీరథ కింద రూ.42 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధజలం అందించేందుకు కంకణం కట్టుకున్నామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఈ రెండు పథకాలకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆశయానికి ముచ్చటపడిన నీతి ఆయోగ్ బృందం.. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ రెండు పథకాలకు సాయం అందించడం సహేతుకమని పేర్కొన్నది. మిషన్ కాకతీయతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలాలు పెరుగుతాయని, వేసవి, కరువు పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపింది.
కేంద్రం ఏం చేసింది?
2016 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.24 వేల కోట్లు కాదు కదా.. కనీసం 24 పైసలు కూడా విదల్చలేదు. మూడు దశల్లో ఈ నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్ సూచిస్తే.. పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా తేలు కుట్టిన దొంగలా గమ్మున కూర్చుంది. ఓ సంద్భంలో ‘నీతి ఆయోగ్ ప్రతిపాదనలపై చూద్దాంలే’ అంటూ నాటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ వ్యాఖ్యానించారు. తెలంగాణను సందర్శించి మిషన్ భగీరథను చూసిరావాలని, దాని సాంకేతికతను ఉపయోగించుకోవాలని స్వయంగా రాష్ర్టాలకు లేఖ రాసింది. పైగా మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి, హర్ ఘర్ జల్ పేరుతో ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి 2019లో శ్రీకారం చుట్టింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను మీ రాష్ర్టాల్లోనూ అమలు చేయండంటూ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా సూచించారు. ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా హైదరాబాద్లో జాతీయ స్థాయి సదస్సు కూడా నిర్వహించారు.
బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?
2016 జూలై 24న అప్పటి బీజేపీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వయంగా మీడియా సమావేశంలో ‘నీతి ఆయోగ్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను అభినందించింది. వీటికి ఆర్థిక చేయూత అందించాలని ప్రతిపాదించింది. ఈ విషయంలో నేను ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీతో మాట్లాడాను. నిధులు విడుదల చేయాలని కోరాను. త్వరలో నిధులు వస్తాయని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. ఈ ప్రకటన వచ్చి ఐదున్నరేండ్లు దాటిపోయింది. కనీసం ఐదు పైసలు కూడా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇందులో కిషన్రెడ్డి కేంద్ర మంత్రి. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయినా ఒక్కసారి కూడా ఈ నిధుల విడుదల గురించి కనీసం ప్రస్తావించలేదు. ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టి తిరిగిరావడం.. గల్లీకి వచ్చి గప్పాలు కొట్టడం తప్ప ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు. ఢిల్లీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరిపానంటూ చెప్పుకొనే థర్డ్ గ్రేడ్ నాయకులు కూడా కనీసం నోరెత్తడం లేదు. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ సైతం స్వయంగా టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వినతి పత్రం అందించారు. కేంద్రం సరిగా స్పందించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కనీసం నోరెత్తడం లేదు.
మరి ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకుఈసారైనా.. బీజేపీ ఎంపీలు తెస్తారా? మోదీ ఇస్తారా?
విజ్ఞప్తులు బుట్టదాఖలు
నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలాసీతారామన్కు పలుమార్లు లేఖలు రాశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, టీఆర్ఎస్ ఎంపీలు.. ఇలా ఎంతో మంది కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి కేంద్ర మంత్రులు వచ్చినా, నీతి ఆయోగ్ బృందం వచ్చినా.. ప్రభుత్వం ఈ నిధుల గురించి విన్నవించింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ ప్రశంసలు గుర్తులేవా?
సీఎం కేసీఆర్ సంకల్ప బలం వల్లే భగీరథ సాధ్యమైంది -ప్రధాని మోదీ (మిషన్ భగీరథ ప్రారంభం సందర్భంగా)
తెలంగాణ సోదరులు మిషన్ భగీరథ ద్వారా కృష్ణా, గోదావరి నదీ జలాలను అత్యంత ఉత్తమమైన పద్ధతిలో వినియోగిస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో కూడా ఇలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది. – ప్రధాని మోదీ (2016 మే 22న మన్ కీ బాత్)
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రధాని మోదీ ప్రతి సమావేశంలోనూ దీన్ని ప్రస్తావిస్తున్నారు.
-అరవింద్ పనగరియా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ (మాజీ)
మిషన్ భగీరథ దేశానికే స్ఫూర్తిదాయకం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసింది -గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి (ఛత్తీస్గఢ్లో మీడియాతో)
దేశంలో తెలంగాణ, గోవా మాత్రమే వందశాతం ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్నాయి. రెండు రాష్ర్టాలకు అభినందనలు.
-గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి (2021 జనవరి 21న ట్వీట్)
మిషన్ కాకతీయ పథకం బాగున్నది. స్వయంగా వచ్చి ఫలితాలను పరిశీలిస్తాను.
-మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఢిల్లీలో ఏ కార్యక్రమంలో చూసినా మిషన్ భగీరథపైనే చర్చ జరుగుతున్నది. అందుకే స్వయంగా చూడాలని వచ్చా
-నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వయిజర్ పీకే ఝా
2024 నాటికి ప్రతి ఇంటికీ నల్లా నీరు అందించాలని కేంద్రం భావిస్తే.. తెలంగాణ ముందుగానే దాన్ని సాధించింది. ఇది గర్వించాల్సిన విషయం. మిషన్ భగీరథ అద్భుతం. -కేంద్ర జల్ జీవన్ మిషన్ టాస్క్ఫోర్స్
కోట్లాది మందికి తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం. రూ.40 వేల కోట్లతో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం సాహసోపేతం. -నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
కేంద్రం కన్నా ముందే ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న ఘనతను తెలంగాణ సాధించడం అభినందనీయం. -కేంద్ర తాగునీటి శాఖ మంత్రి అహ్లూవాలియా
వ్యవసాయానికి మిషన్ కాకతీయ వరం -వీకే సారస్వత్, నీతి ఆయోగ్ సభ్యుడు
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం -జల్ జీవన మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్
తెలంగాణ స్ఫూర్తితో మా రాష్ట్రంలోని బుందేల్ఖండ్లో తాగునీటి పథకం అమలు చేస్తాం. దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణను అనుసరించాల్సిందే
-:అఖిలేశ్ యాదవ్ (యూపీ సీఎంగా ఉన్నప్పుడు)
మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జల సంరక్షణకు సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలు భేష్ -ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కెన్ ఉదయ్సాగర్
మిషన్ కాకతీయ అద్భుత పథకం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తుండటం అభినందనీయం -వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్
ఇవి కేవలం కొన్ని మాత్రమే. మిషన్ కాకతీయ గురించి అంతర్జాతీయ జల వారోత్సవాల్లో చర్చించగా, జాతీయ వాటర్ మిషన్-2019లో మిషన్ భగీరథకు మొదటి స్థానం ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం సైతం ప్రత్యేకంగా ప్రశంసించింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీ, ఒడిశా తదితర రాష్ర్టాల ప్రతినిధులు తెలంగాణకు వచ్చి ఈ పథకాలను పరిశీలించారు.