న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం పాలనాపరమైన ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం ముందు సోమవారం ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్రం తరపు న్యాయవాది, అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి.. వెంటనే తమ పిటిషన్పై విచారణ చేపట్టాలని కోరారు.
అయితే తీర్పు సమీక్ష అభ్యర్థనను ఈమెయిల్ ద్వారా పంపిస్తే తాము పరిశీలిస్తామని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఆరోపణలు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పలు కంపెనీలకు కేటాయించిన 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు 2012లో తీర్పు వెలువరించింది. సహజ వనరులను కేటాయింపు లేదా బదిలీ చేసే సమయంలో పారదర్శకంగా వేలం ప్రక్రియను పాటించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. తద్వారా ఈ వేలం ప్రక్రియలో అర్హులైన వాళ్లు పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.