రూ.653 కోట్ల కోసం నోటీసు ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 5: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామీకి కేంద్ర ప్రభు త్వం రూ.653 కోట్ల దిగుమతి సుంకం ఎగవేత నోటీసునిచ్చింది. షియామీ ఇండియా యూనిట్లో రెవిన్యూ శాఖ నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాల ఆధారంగా షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తులో షియామీ ఇండియా రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్టు గుర్తించామన్నది. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ కింద అమెరికాకు చెందిన క్వాల్కామ్తోపాటు చైనాకు చెందిన బీజింగ్ షియామీ సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్కు రాయల్టీ, లైసెన్స్ ఫీజులను షియామీ ఇండియా పంపినట్టు బయటపడింది. లావాదేవీ విలువలో వీటిని పేర్కొనకుండా కస్టమ్స్ చట్టం 1962లోని సెక్షన్ 14, కస్టమ్స్ వాల్యుయేషన్ రూల్స్ 2007ను షియామీ ఇండియా ఉల్లంఘించిందని, దిగుమతి చేసుకున్న వస్తూత్పత్తుల విలువను తగ్గించి కస్టమ్స్ సుంకాన్ని ఎగవేశారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోకి దిగుమతైన మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలు షియామీ సంస్థల మధ్యే జరుగడంతో సదరు సంస్థ, దాని కాంట్రాక్ట్ తయారీదారులపై అధికారులు ఇప్పుడు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మరోవైపు తమకు అందిన నోటీసును పరిశీలించి తగువిధంగా స్పందిస్తామని షియామీ చెప్తున్నది.