దొడ్డిదోవన మార్చడం కాదు.. దమ్ముంటే పార్లమెంటులో చట్టం తెండి
క్యాడర్ రూల్స్ మార్పుపై కేసీఆర్ ఆగ్రహం.. ప్రధాని మోదీకి లేఖ
దీంతో కేంద్రం గుప్పిట్లోకి ఏఐఎస్లు
ఇది రాష్ట్రాల విధుల్లో తలదూర్చడమే
ఇక రాష్ట్రాల పాత్ర నామమాత్రం!
క్యాడర్ నిబంధనలను మార్చొద్దు
ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి
కేంద్రానికి సీఎం కేసీఆర్ డిమాండ్
హైదరాబాద్, జనవరి 24 : అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారుల క్యాడర్ రూల్స్ మార్చే ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో సంబంధం లేకుండా నేరుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్పై తీసుకొనేలా ‘అఖిల భారత సర్వీసుల (క్యాడర్) నిబంధనలు-1954’ సవరించడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభు త్వాల విధుల్లోకి కేంద్రం నేరుగా తలదూర్చడమేనని, ఏఐఎస్ అధికారులను తన గుప్పిట్లోకి తెచ్చుకొనే ఎత్తుగడ అని మండిపడ్డారు. ఏఐఎస్ క్యాడర్ రూల్స్ను సవరిస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ అధికారులను రాష్ర్టాల్లో సామరస్యతతో, చక్కని సమతుల్యతతో వినియోగించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సరిపోతాయని స్పష్టం చేశారు. ఒకవేళ మార్చాలనుకొంటే ఇలా దొడ్డిదారిన కాకుండా దమ్ముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరణలు చేయాలని సవాల్ విసిరారు.
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖ పూర్తి పాఠం..
నరేంద్ర మోదీ గారికి..
అఖిల భారత సర్వీసుల (క్యాడర్) నిబంధనలు-1954కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను.