కాచిగూడ, జనవరి 5: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదని, అది కేంద్రం చేతకానితనమే అవుతుందని బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం ఆందోళన వ్యక్తంచేశారు. ‘సేవ్ పబ్లిక్ సెక్టార్-సేవ్ ఇండియా’ అనే అంశంపై సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం కాచిగూడలోని జాగృతి భవన్లో అఖిల భారత ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలే దేశానికి వెన్నెముకని, అలాంటి సంస్థలను నిర్వీర్యం చేయడం కేంద్రం చేతకానితనమేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించరాదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల కార్మికులతో కలిసి ఢిల్లీలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నష్టాల సాకుతో కేంద్రం.. రైల్వేలు, బీమా, టెలికం, తపాలా, రక్షణ, విమానయాన రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను మూసేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి పీ లక్ష్మీనారాయణ, పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.