హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. విభజన చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికోసం ఇవ్వాల్సిన నిధులను కూడా రెండేండ్లుగా ఇవ్వడంలేదని చెప్పారు. గురువారం ఢిల్లీలో నీతిఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్ను రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో వెళ్లి కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.24,205 కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ కూడా సిఫారసు చేసిందని, ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చిందని గుర్తుచేశారు.
నీతి ఆయోగ్ సిఫారసు తర్వాత విభజన నాటికి ఉన్న ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున 9 జిల్లాలకు రూ.450 కోట్లను ఇవ్వాలని చెప్పిందని, గడిచిన రెండేండ్లుగా ఈ నిధులు కూడా ఆగిపోయాయని తెలిపారు. తెలంగాణకు 900 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ఆర్థికశాఖ సహకరించేలా చూడాలని, నీతి ఆయోగ్ చొరవ తీసుకొని రూ.900 కోట్ల నిధులు వచ్చేలా చూడాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
రాష్ర్టాల హక్కులను హరిస్తున్న కేంద్రం
రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మండిపడ్డారు. గురువారం జాతీయ రైతు సంఘాల సమాఖ్య (సీఐఎఫ్ఏ) ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయాభివృద్ధి చర్చా కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇప్పుడు దేశంలో పంటలు పండించడం కన్నా పండించిన పంటలు అమ్ముకోవడమే ఇబ్బందిగా ఉన్నదన్నారు. సీఐఎఫ్ఏ ముఖ్య సలహాదారు చెంగల్రెడ్డి మాట్లాడుతూ… పంటలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, పంటలు పండించడం వరకే రాష్ర్టాల బాధ్యతని, ఎగుమతి చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సమావేశంలో దేవీప్రసాద్, సీఐఎఫ్ఏ డైరెక్టర్ ఉషారాణితోపాటు వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘం నేతలు పాల్గొన్నారు.