నిర్మల్ అర్బన్, మార్చి 24 : వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టబోయే ఆందోళనలు, నిరసనలు, తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్మల్ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో గురువారం టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిని చూడలేకే, దెబ్బతీయాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. వరిధాన్యం కొనకుండా, రైతాంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నదని మండిపడ్డారు. పంజాబ్, హర్యానా వడ్లు కొని, మనవి కొనకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. పంటల దిగుబడిని పూర్తిగా తగ్గించాలంటే కరెంట్ మోటర్లకు మీటర్లు బిగించాలనే కుట్రకు కేంద్రం తెరలేపిందని, వీటిని తిప్పి కొట్టేందుకు రైతాంగం సంఘటితంగా ఉండాలని సూచించారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే, కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. వన్ నేషన్ -వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 31 వరకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా, మండల స్థాయి రైతు బంధు సమితి, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్, మున్సిపాల్టీలలో పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టి, తీర్మానాలు చేసి పంపాలని కోరారు. నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, సారంగపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నర్మదా ముత్యం రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు రఘు నందన్ రెడ్డి, ధర్మాజీ రాజేందర్,అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సుభాష్ రావు, పాకాల రాంచందర్, ముడుసు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.