అమరావతి : వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం ఆయన ‘వైఎస్సార్ రైతు భరోసా’లో భాగంగా అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్రెడ్డి గురువారం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలుగకుండా రైతు భరోసా మొదటి విడుత నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పథకం ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
ఇప్పటి వరకు రూ.89 వేల కోట్లు ఖాతాలోకి నేరుగా జమ చేశామని, గత 23 నెలల్లో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు విడుదల చేశామని, ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,038 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్లపై స్పందిస్తూ దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి 172 కోట్ల టీకా డోసులు కావాలని, ఇప్పటి వరకు కేవలం కేంద్ర ప్రభుత్వం 18 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చిందన్నారు. ఏపీలో 18 ఏళ్లుపైబడ్డ వారికి 7 కోట్ల టీకా డోసులు కావాలని.. ఇప్పటి దాకా కేంద్రం ఏపీ 73 లక్షల టీకా డోసులు మాత్రమేనని సీఎం వివరించారు. దేశంలో కేవలం రెండు కంపెనీలే వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్నాయని.. నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నిబంధనలు పాటిస్తూనే కరోనాపై యుద్ధం చేయాలన్నారు.