సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీ సర్కార్ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట మండలం టేకుమట్లలో, భువనగిరి మండలం తుక్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాలను ప్రారంభించారు. టేకుమట్లలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏకధాటిగా పట్టుమని పది నిమిషాలు విద్యుత్తు సరఫరా చేయలేని దుస్థితిలో ఉండటంతో అక్కడి ప్రజలు ఆందోళన బాటపట్టి.. తెలంగాణ మాదిరిగా కరెంట్ సరఫరా కావాలి డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా తెలంగాణ విద్యుత్తుపై కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
తెలంగాణ విజయం సాధించిన రంగాలపై దెబ్బకొట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందని విమర్శించారు. దేశంలోని ఏ విద్యుత్తు విక్రయ సంస్థ కూడా తెలంగాణకు కరెంటు అమ్మవద్దంటూ స్వయాన కేంద్రమంత్రి రంగంలోకి దిగి ఒత్తిడి తీసుకురావడం సిగ్గుచేటన్నారు. అదీగాక రైతుల మోటర్లకు మీటర్లు పెట్టకపోవడంతో యాదాద్రి పవర్ ప్లాంట్కు మంజూరైన రుణాలను నిలిపివేయించడంతోపాటు 24 గంటల విద్యుత్తు సరఫరా ఆపకపోతే కేంద్రం నుంచి సహకారాన్ని నిలిపివేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ లక్ష్యాన్ని అడ్డుకోలేరని స్పష్టంచేశారు. కేంద్రం చర్యల వల్ల ఒకటి, రెండు రోజులు ఏమైనా విద్యుత్తుకు ఆటంకాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. వారి చర్యల వల్ల డిస్కంలపై భారం పడి ట్రిప్ అయ్యి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చని, ఎన్ని జరిగినా రైతాంగంతోపాటు అన్ని వర్గాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేసి తీరుతామని మంత్రి తెలిపారు.