హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రం, సీఎమ్మార్ గడువు పొడిగించకుండా కక్ష సాధిస్తున్నది. 2020-21 యాసంగి సీజన్ సీఎమ్మార్ గడువు మార్చి 31తో ముగిసింది. గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా, కేంద్రం ఆధీనంలోని ఎఫ్సీఐ దాటవేస్తున్నది. గడువు ముగియడంతో మిల్లుల నుంచి వచ్చే బియ్యం లారీలను ఎఫ్సీఐ గోదాముల్లోకి అనుమతించడం లేదు. గత యాసంగిలో అంచనాలకు మించి ఉత్పత్తి రావడంతో ఎక్కువగా కొనుగోలు చేశామని, మరో రెండు నెలలు గడువు పొడిగించాలని ఎఫ్సీఐకి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ 15 రోజులు ముందే లేఖ రాయగా, ఎఫ్సీఐ నుంచి స్పందన లేదు. ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసిన ఎఫ్సీఐ రాష్ట్ర శాఖ.. సీఎమ్మార్ గడువును మరో నెల పాటు పొడిగించొచ్చని సిఫారసు చేసినప్పటికీ, ఎఫ్సీఐ నిర్ణయం తీసుకోవడం లేదు. కేంద్రం సీఎమ్మార్ గడువు పొడగించకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3 వేల కోట్ల అర్థిక భారం పడనున్నది.
కుక్క కాటుకు, పాము కాటుకు ఒకే మంత్రం అన్నట్టుగా ఉన్నది కేంద్రం, ఎఫ్సీఐ వైఖరి. ధాన్యం ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా ఒకే గడువు అంటూ వింత వాదన తెరపైకి తీసుకొస్తున్నది. 2019-20లో యా సంగిలో 64.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా సీఎమ్మార్ ఇచ్చేందుకు ఎఫ్సీఐ 12 నెలల గడువు ఇచ్చింది. 2020-21లో 92.34 లక్ష ల టన్నులు.. అంటే గతంతో పోల్చితే 44 శాతం అధిక ధాన్యాన్ని రాష్ట్రం కొనుగోలు చేసింది. ఇంత భారీ మొ త్తంలో ధాన్యాన్ని సీఎమ్మార్గా మార్చి ఇచ్చేందుకు కూ డా ఎఫ్సీఐ 12 నెలల సమయమే ఇచ్చింది. 62.52 లక్ష ల టన్నుల సీఎమ్మార్(బియ్యం)కు ఇప్పటికే 54 లక్షల టన్నుల బియాన్ని ప్రభుత్వం అందజేసింది మరో 8.52 లక్షల టన్నులే ఇవ్వాల్సి ఉన్నది. 2019-20తో పోల్చితే 2020-21 సీజన్కు సంబంధించి ఈ సమయానికి 11 లక్షల టన్నుల బియ్యం అధికంగా ఎఫ్సీఐకి అందజేసింది. దీన్ని బట్టి అధికారులు, మిల్లర్లు ఎంత వేగంగా సీఎమ్మార్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారనేది స్పష్టమవుతున్నది. పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చినందున గడువు పెంచాలని కోరినప్పటికీ కేంద్రం, ఎఫ్సీఐ నుంచి ఆశించినస్థాయిలో సహకారం అందడం లేదు.
ఓవైపు నిర్ణీత సమయంలో సీఎమ్మార్ ఇవ్వలేదంటున్న ఎఫ్సీఐ, మరోవైపు తనిఖీల పేరుతో రోజుల తరబడి మిల్లింగ్ను నిలిపివేసింది. దీంతో సీఎమ్మార్ ఆలస్యానికి పరోక్షంగా ఎఫ్సీఐనే కారణమనే వాదనలు ఉన్నాయి. సీఎమ్మార్ ఇచ్చేందుకు అవసరమైన ధాన్యం మిల్లుల్లో ఉందా? లేదా? అనే విషయంపై ఎఫ్సీఐ పలుమార్లు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించింది. ఒక మండలం లేక జిల్లాలో మిల్లింగ్ నిలిపివేస్తే ఇబ్బంది లేదు. కానీ, ఒక్క మండల పరిధిలోని మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ను నిలిపివేయించింది. ఇలా రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ నిలిచిపోయింది. తనిఖీల పేరుతో మిల్లింగ్ నిలిపివేయకపోతే, గడువులోగానే సీఎమ్మార్ అందించేవాళ్లమని అధికారులు, మిల్లర్లు చెప్తున్నారు.
ఏడాది రాష్ట్ర కొనుగోళ్లు గడువు
యాసంగి ధాన్యం(టన్నుల్లో) (నెలల్లో)
2018-19 37.05 లక్షలు 13
2019-20 64.17 లక్షలు 12
2020-21 92.34 లక్షలు 12