హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వచ్చే యాసంగిలో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉండి నాలుగు పైసలొచ్చే వివిధ రకాల ఇతర పంటలను సాగుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆదాయం ఇచ్చే పప్పుగింజలు, నూనె గింజల వంటి పంటలను సాగుచేయాలని కోరారు. గురువారం మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్ర రైతులకు బహిరంగలేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక విధానాలతో నష్టపోకుండా ఉండేందుకు రైతులు వరికి బదులు ఇతర పంటలు పండించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. కేంద్ర మోసపూరిత విధానాలను ముందే పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని, రైతు వ్యతిరేక విధానాలను గుర్తించాలని కోరారు.
అన్నపూర్ణగా మారిన తెలంగాణ
సమైక్య రాష్ట్రంలో ఆకలి చావుల తెలంగాణగా ఉన్న రాష్ట్రం.. సీఎం కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాలతో అన్నపూర్ణగా మారిందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి.. అదే స్ఫూర్తితో అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును అనతికాలంలోనే పూర్తిచేసి తెలంగాణ రైతుల సాగునీటి గోస తీర్చారని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన తెలంగాణ రైతుల్లో రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి మళ్లీ ఆత్మవిశ్వాసం నింపారని అన్నారు.
ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తెలంగాణ వ్యవసాయరంగంపైనా, రైతులపైనా కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గతంలో మద్దతుధర ఇచ్చి దొడ్డు వడ్ల కొనుగోలును ప్రోత్సహించిన కేంద్రం.. ఇప్పుడు ఉన్నపళంగా నిల్వలు ఎక్కువున్నాయనే సాకుతో బాయిల్డ్ రైస్ సేకరించబోమని చెప్పడం దారుణమని తెలిపారు. కేంద్ర మంత్రులు పార్లమెంట్లో ఒక్కో మాట చెప్తుంటే.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు మరో మాట చెప్తున్నారని పేర్కొన్నారు. రైతులను గందరగోళ పరుస్తూ.. ధాన్యం విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి.. పంటమార్పిడివైపు వెళ్లాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
రైతులను గందరగోళ పరుస్తూ.. ధాన్యం విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి పంట మార్పిడివైపు వెళ్లాలి.