హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందిపెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి కేటాయించిన ఎరువులను సకాలంలో ఇవ్వటం లేదని అన్నారు. బుధవారం లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ రాష్ర్టానికి ఎరువుల కేటాయింపు సరిగా లేదని చెప్పారు. దీనిపై కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా, ప్రత్యక్షంగా కలిసి మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని అన్నారు. యాసంగి సీజన్లో కేంద్రం రాష్ర్టానికి 20.5 లక్షల టన్నుల ఎరువులను కేటాయించిందని చెప్పారు. ఇందులో అక్టోబర్, నవంబర్ మాసాల్లో 6.4 లక్షల టన్నులు అవసరం కాగా, కేవలం 3.67 లక్షల టన్నులు మాత్రమే కేటాయించారని, ఇప్పటివరకు 1.55 లక్షల టన్నులే సరఫరా చేశారని వివరించారు. ఇంకా 2.12 లక్షల టన్నులు రావాల్సి ఉందన్నారు. క్రిభ్కో నుంచి నెలకు 20 వేల టన్నుల యూరియా రావాల్సి ఉండగా గత నవంబర్లో మూడు వేల టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. రైతుల పరిస్థితి దృష్టిలో ఉంచుకొని కేంద్రం సకాలంలో స్పందించి ఎరువుల కేటాయింపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.