సీఎం ప్రకటనతో సెర్ప్, మెప్మా సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ల సంబురాలు
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 16: ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకొంటామని, సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని, మధ్యాహ్నభోజన కార్మికుల వేతనాలు పెంచుతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా విభాగాల ఉద్యోగులు, సిబ్బంది బుధవారం సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు టీసీవోస్ అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్, మెప్మా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణచైతన్య, జీహెచ్ఎంసీ యూసీడీ ఉద్యోగుల అధ్యక్షుడు నల్లతీగల మధు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్కేవీ అనుబంధ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ యాదయ్య, అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి పాల్గొన్నారు.
అనంతరం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సెర్ప్ ఉద్యోగులు, ఉపాధి హామీ సంఘాల బాధ్యులు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు బషీర్బాగ్లోని మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయానికి వచ్చి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 54 వేల మంది కార్మికుల కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారని కొనియాడారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హన్మాండ్లు, కార్యదర్శి బాబాయ్ పాల్గొన్నారు. సీఎం నిర్ణయంపై టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హర్షం వ్యక్తంచేశారు. డైట్ ఏజెన్సీల్లో 16 శాతాన్ని ఎస్సీలకు కేటాయించటంపై ఆనందం వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.. మంత్రి ఎర్రబెల్లిని కలిసి సన్మానించారు. 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు జీవింతాంతం కేసీఆర్కు రుణపడి ఉంటాయన్నారు. ఆయనవెంట బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, పగిడాల సుధాకర్ ఉన్నారు. సీఎం తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పీ ప్రేంపావని పేర్కొన్నారు.