న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజనకు సంబంధించిన తుది నివేదికను కమిటీ సమర్పించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర స్పందించారు. నోటిఫికేషన్ ప్రకారం.. 90 అసెంబ్లీ నియోజకవర్గాలను, అయిదు పార్లమెంటరీ నియోజకవర్గాలను జమ్మూకశ్మీర్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జమ్మూలో 43, కశ్మీర్ వ్యాలీలో 47 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయా సొంత జిల్లాలకే పరిమితం అయ్యేలా పునర్ విభజన చేశామని సుశీల్ చంద్ర తెలిపారు. గతంలో అసెంబ్లీ నియోజకవర్గాలు వేర్వురు జిల్లాల్లో విభజించి ఉండేవన్నారు.
జమ్మూకశ్మీర్ను అయిదు పార్లమెంటరీ నియోజకవర్గాలుగా విభజించామని, అయితే అన్ని నియోజకవర్గాల్లో సమానరీతిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే విధంగా చూశామన్నారు. ఒక్కొక్క పార్లమెంట్ సీటులో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేలా కమిషన్ చర్యలు తీసుకుందని సుశీల్ చంద్ర తెలిపారు.