రామన్నపేట, నవంబర్ 05 : పత్తి రైతుల వద్ద ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన ఎత్తివేసి, 20 శాతం తేమ ఉన్నా షరతులు విధించకుండా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిరిపురం గ్రామంలో సిపిఎం-రైతు సంఘం ఆధ్వర్యంలో తుఫాను మూలంగా నష్టపోయిన పత్తి పంటను పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అప్పులు చేసి, పెట్టుబడి పెట్టి చేత్తికొచ్చే సమయానికి వర్షాలు రైతులను నిండా ముంచాయన్నారు. ఇదిలా ఉంటే ఎకరాకు కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం షరతులు పెట్టడంతో కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు సాంకేతిక అవగాహన లేక ముందస్తుగా నమోదు చేసుకోలేక పోవడంతో పత్తిని సీసీఐ కేంద్రాలు కొనుగోలు చేయడం లేదన్నారు.
దీంతో రూ.4 వేలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని నష్ట పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ తో కాకుండా టోకెన్ విధానంతో వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలన్నారు. తేమ శాతం 20 ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పత్తి పంటపై విదేశీ సుంకం 11 శాతానికి తగ్గించాలని చూస్తుందని, అలా అయితే మద్దతు ధర తగ్గుతుందని రైతులకు నష్టం వాటిల్లితుందన్నారు. అధిక వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేల నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు బల్గురి అంజయ్య, శాఖ కార్యదర్శి అంబటి సురేందర్ రెడ్డి, కునూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, సుభాష్ రెడ్డి, పల్లె సత్యం, కునూరు గణేశ్, మల్లేశ్, మార్త భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.