CBSE | న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: 2025-26 అకడమిక్ సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడంపై విధివిధానాలు రూపొందించాలని సీబీఎస్ఈని కేంద్ర విద్యా శాఖ కోరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని తెలిపాయి. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే అంశంపై విద్యా శాఖ, సీబీఎస్ఈ వచ్చే నెలలో పాఠశాలల ప్రిన్సిపాల్స్తో సంప్రదింపులు చేయనున్నట్టు పేర్కొన్నాయి.
విద్యార్థులకు సరిపడా సమయం ఉండటంతోపాటుగా పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కనపర్చేందుకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ గత ఏడాది విడుదల చేసిన కొత్త నేషనల్ కరికులమ్ ఫ్రేమ్వర్క్(ఎన్సీఎఫ్) సూచించింది. కాగా, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో మాట్లాడుతూ బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరుకావడం విద్యార్థులకు తప్పనిసరేం కాదని పేర్కొన్నారు. జేఈఈ మాదిరిగానే 10, 12 తరగతుల విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరవ్వచ్చని, అది ఐచ్ఛికం అని చెప్పారు.