NEET-UG 2024 : నీట్ యూజీ-2024 (NEET-UG 2024) పరీక్ష పేపర్ లీకైందంటూ జరుగుతున్న ప్రచారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించింది. నీట్ పేపర్ లీకయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు, వారి పేరెంట్స్ ఈ పుకార్లను నమ్మవద్దని చెప్పింది. ఈ పుకార్లను పట్టించుకోకుండా రాబోయే పరీక్షల కోసం చదువుకోవాలని విద్యార్థులకు సూచించింది.
ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో నీటీ పరీక్ష నిర్వహించారు. ఈ 571 నగరాల్లో 14 నగరాలు విదేశాలకు చెందినవి ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రం మాదోపూర్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఎన్టీఏ నిబంధనలను ఉల్లంఘించిన కొందరు విద్యార్థులు పరీక్ష సమయం ముగియకముందే ప్రశ్నపత్రాలు తీసుకుని బయటికి వెళ్లారని, అదే పేపర్ లీకేజీ ప్రచారం జరుగుతోందని అధికారులు తెలిపారు.
నీట్ పరీక్షలన సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించామని, పేపర్ లీకయ్యే ఛాన్సే లేదని ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు, సిబ్బంది మినహా బయటి వ్యక్తి పరీక్ష హాల్లోకి వచ్చే పరిస్థితే లేదని పేర్కొంది. నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు, పేరెంట్స్కు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రకటించింది.