హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైడ్రామా నడుస్తున్నది. వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ అవినాశ్రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 22న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు పంపగా, తల్లి అనారోగ్యం దృష్ట్యా తాను సోమవారం విచారణకు రాలేనంటూ అధికారులకు ఎంపీ లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే విశ్వభారతి దవాఖానకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కర్నూలు దవాఖానకు చేరుకున్న సీబీఐ అధికారులు ఎస్పీతో చర్చించారు. లొంగిపోవాలని ఎంపీ అవినాశ్కు చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఎస్పీని కోరారు. శాంతిభద్రతల నేపథ్యంలో ఎస్పీతో వారు చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా, సీబీఐకి అవినాశ్రెడ్డి మరో లేఖ రాశారు. తల్లి అనారోగ్యం, సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్నందున 27 వరకు గడువు ఇవ్వాలని కోరారు. తల్లి ఆరోగ్య కుదుట పడ్డ తర్వాత విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.